సిద్దిపేట, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలను నియమించింది. జిల్లాలోని సీనియర్ నాయకులను ఆయా అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలుగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం రాత్రి విడుదల చేశారు. అనంతరం మంత్రి హరీశ్రావుతో కలిసి టెలీ కాన్పరెన్స్ నిర్వహించి పార్టీ ఇన్చార్జిలకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ శాసనసభ స్థానానికి రాష్ట్ర మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి ఇన్చార్జులుగా వ్యవహరిస్తారు.
దుబ్బాక నియోజకవర్గానికి టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లును, మెదక్ నియోజకవర్గానికి కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని, ఆందోల్కు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ను, నర్సాపూర్కు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్కు మాజీ బేవైరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, సంగారెడ్డికి రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ వి.భూపాల్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను నియమించారు. వీరంతా ఆయా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషిచేస్తారు.