హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం వరంగల్ లోకసభకు పోటీచేసే అభ్యర్థి ప్రకటనతో పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించడంలో బీఆర్ఎస్ తన రికార్డును తానే తిరగరాసుకున్నది. తెలంగాణలో దళిత, బహుజనవాదాన్ని ఎత్తుకొని ఆ వర్గాల అభ్యున్నతికి మొదటి నుంచి కృషి చేస్తున్న ఏకైక నాయకుడిగా పార్టీ అధినేత కేసీఆర్ మరో నిరూపించారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ప్రజాబలం ఉన్న నేతలను ఎంపికచేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకన్నా విజయావకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితిని బీఆర్ఎస్ సృష్టించుకుంటున్నదని చెప్తున్నారు. అభ్యర్థుల ప్రకటనతోనే బీఆర్ఎస్ ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని పార్లమెంటు ఎన్నికల్లో విజయ దుందుభి మోగించేందుకు పార్టీ సన్నద్ధమవుతున్నది. కేసీఆర్ దిశానిర్దేశంతో కార్యక్షేత్రంలో అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ మాత్రం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను, మాజీ ఎంపీలను తమ పార్టీల్లో చేర్చుకుని టికెట్లు ఇచ్చి బరిలో నిలుపుతున్నాయి. వరంగల్ లోక్సభ స్థానానికి తొలుత కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆమెను తమ పార్టీలో చేర్చుకుని అదే స్థానం నుంచి బరిలో నిలిపింది.
బీసీలకు ఆరు స్థానాలు
రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో ఆరింటిని బీసీలకు, మున్నూరుకాపులకు రెండు (జహీరాబాద్, నిజామాబాద్) స్థానాలు కేటాయించగా, చేవెళ్ల స్థానాన్ని ముదిరాజ్లకు, సికింద్రాబాద్ను గౌడ సామాజికవర్గానికి, భువనగిరి స్థానాన్ని గొల్లకుర్మలు, హైదరాబాద్ స్థానాన్ని యాదవులు, మహబూబ్నగర్, నల్లగొండ, మె దక్, మల్కాజిగిరి స్థానాలను రెడ్డి సామాజిక వ ర్గానికి బీఆర్ఎస్ కేటాయించింది. వెలమ, కమ్మ సామాజిక వర్గానికి ఒక్కో సీటు కేటాయించింది.
మాదిగ సామాజిక వర్గానికి రెండు
రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వు స్థానాల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ మాదిగలకు కేటాయించకుండా ఆ సామాజిక వర్గం ఆగ్రహానికి గురైంది. బీఆర్ఎస్ మాత్రం నాగర్ కర్నూల్, వరంగ్ స్థానాలను మాదిగ సామాజిక వర్గానికి, పెద్దపల్లి స్థానాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నది. ఎస్టీల్లో ఆదివాసీ, మైదాన గిరిజనులకూ కేసీఆర్ సమాన అవకాశాలు కల్పించారు. ఆదిలాబాద్ స్థానాన్ని ఆదివాసీ (గోండు) గిరిజనులకు కేటాయించగా, మహబూబాబాద్ స్థానాన్ని మైదానప్రాంత గిరిజన (బంజారా/లంబాడా) గిరిజనులకు కేటాయించడం గమనార్హం. మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాన్ని మహిళలకు కేటాయించారు.