BRS Party | బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) కవులు, కళాకారులు, రచయితలకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం( Telangana Movement )లో ప్రత్యేక రాష్ట్రం కోసం తమ గొంతును, తమ కలానికి పదునుపెట్టిన కవులు, రచయితలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కవులు, కళాకారులు, రచయితలకు సీఎం కేసీఆర్ గౌరవప్రదమైన పదవులను కట్టబెడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ధూం ధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్( Rasamai Balakishan )కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించగా, రెండేండ్ల క్రితం ప్రముఖ కవి, రచయిత గోరటి వెంకన్న( Goreti Venkanna )కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తాజాగా కవి, రచయిత దేశపతి శ్రీనివాస్( Deshapati Srinivas )కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. కవులు, రచయితలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రసమయి బాలకిషన్ తన టీచర్ వృత్తిని వదులుకొని తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ధూం ధాం వేదికలపై తన ఆటపాటతో తెలంగాణ యువతను ఒకతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మానకొండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తెలంగాణ సాంస్కృతిక సారథికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
గోరటి వెంకన్న కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తన పాటతో తెలంగాణను ఉర్రుతలూగించారు. ఆటతో సభా ప్రాంగణానికి పూనకాలు తెప్పించేవారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో అన్యాయానికి గురవుతున్న తెలంగాణను నేపథ్యంగా చేసుకోని వెంకన్న ఎన్నో పాటలు రాశారు. కవి, రచయిత, గాయకుడిగా ఉన్న గోరటి వెంకన్నకు గవర్నర్ కోటాలో 2020లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు కేసీఆర్.
ఇప్పుడేమో ఎమ్మెల్యే కోటాలో ప్రముఖ కవి, రచయిత దేశపతి శ్రీనివాస్కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు కేసీఆర్. తెలంగాణ సీఎంవో ఓఎస్డీగా వ్యవహరిస్తున్న దేశపతి.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం తన వాదనలు వినిపించాడు. దేశపతి శ్రీనివాస్ గజ్వేలు దగ్గర మునిగడప గ్రామంలో గోపాలకృష్ణ, బాల సరస్వతి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు, మంచి కవి. గోపాలకృష్ణ మధుశ్రీ అనే ఖండకావ్యాన్ని రాశారు. ఆయనకు తెలుగు సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో నైపుణ్యం ఉంది. వారి తాత గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. వారు పుష్పబాణ విలాసం అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగు లోకి అనువదించారు. వారి మేనమామ రామేశ్వర శర్మ నవ్యకళాసమితి అనే ఒక నాటక సమితిని ఏర్పాటు చేసి, నాటకాలు, యక్షగానాలు తన మిత్రులతో కలిసి ఆడేవారు. వారి ప్రభావం శ్రీనివాస్ పై పడిందని చెప్పొచ్చు.