BRS | హైదరాబాద్ : బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు అద్బుతమైన స్పందన వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 42 నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు ముగిశాయి. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులను పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దం చేయడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు కొత్త ఊపు, ఉత్సాహం, దైర్యాన్ని నింపేందుకు పార్టీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. పార్టీ లక్ష్యానికి అనుగుణంగా సమావేశాలు జరుగుతున్నాయని పార్టీ నాయకులు విశ్లేషించారు.
ఇప్పటి వరకు నిర్వహించిన సమావేశాల్లో ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు వేలకు పైగా కార్యకర్తలు హాజరైన సమావేశాలు కూడా ఉన్నాయని లెక్కలు వేశారు. ఈ నెల రెండో వారం కల్లా సమావేశాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో సహా మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు హాజరవుతున్నారు. సోమవారం మరో 8 నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చేసే తప్పుడు ప్రచారాలను దీటుగా తిప్పి కొట్టడం, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, వాటి ప్రస్తుత పరిస్థితి ప్రజలకు వివరించడం, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాల్సిన ప్రాధాన్యతను ముఖ్య నాయకులు కార్యకర్తలు, నాయకులకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటిలు, కేంద్రంలో మోదీ ఇచ్చిన రూ.15లక్షల బ్యాంకు అకౌంట్లో వేయడం, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, విభజన హామీలు తదితర వాటిని ప్రజలకు గుర్తు చేయాలని సూచిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరింత రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికలను ఎదుర్కొవడానికి సిద్దమవుతున్నారు.