Rahul Gandhi-BRS | కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీపైన కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. తెలంగాణలో రాహుల్ గాంధీ తన తాజా పర్యటనలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘానికి పంపిన ఫిర్యాదులో పేర్కొంది. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా దురుద్దేశ పూర్వకంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావించారని ఆరోపించింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.ఎన్నికల నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల నేతలు ఇతర పార్టీల విధానాల పైన మాత్రమే మాట్లాడాలి గానీ, వ్యక్తిగత ప్రతిష్టకు బంధం కలిగించేలా, అడ్డగోలుగా మాట్లాడకూడరాదని స్పష్టంగా ఉందని బీఆర్ఎస్ గుర్తు చేసింది. అయినా రాహుల్ గాంధీ అబద్ధాలను, అసత్యాలు వల్లె వేశారని బీఆర్ఎస్ ఆరోపించింది.
ఎలాంటి ఆధారాల్లేకుండా రాష్ట్ర పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలను అప్పటి సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేశారని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని, అక్రమం అని ఈసీకి పంపిన లేఖలో బీఆర్ఎస్ వివరించింది. పోలీసుల వ్యవస్థను దుర్వినియోగం చేసి వేల మంది ఫోన్లు ట్యాప్ చేసి, ఆర్థిక ప్రయోజనాలు పొందారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం అని వ్యాఖ్యానించింది. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యల వీడియో క్లిప్లను తన ఫిర్యాదుకు జత చేసింది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని బీఆర్ఎస్ తెలిపింది. ప్రస్తుతం విచారణలో ఉన్న అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడటం చట్ట వ్యతిరేకం అని పేర్కొంది. కేవలం తమ పార్టీని బదనాం చేయాలన్న దురుద్దేశపూర్వక ఆలోచనతోనే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారని, ఆయనవ్యాఖ్యలు ఓట్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది.
రాహుల్ గాంధీ తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని కోరుతూ, ఆయన వ్యాఖ్యలపై వెంటనే విచారణ చేపట్టాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన రాహుల్ గాంధీ ప్రచారం చేయకుండా చర్య తీసుకోవాలని కోరింది. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఈసీకి బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ నాయకులు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేశారు. ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖపైనా బీఆర్ఎస్ మరో ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మంత్రి పైన చర్యలు తీసుకోవాలని కోరింది.