CM KCR | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని, కనీసం 9-10 జిల్లా పరిషత్లను బీఆర్ఎస్ గెలువాలని, తద్వారా మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ సత్తా చూపించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ల నుంచి బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానం చట్ట సభల్లో మొదలు కావాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో శనివారం మహారాష్ట్ర షేత్కరీ సంఘటన నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన ఇష్టాగోష్ఠిలో కేసీఆర్ మాట్లాడారు. రైతు సమస్యల శాశ్వత పరిష్కారమే ఎజెండాగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పనిచేస్తుందని, దేశ రైతాంగ పోరాటంలో మహారాష్ట్ర రైతులు ముందుండాలని పిలుపునిచ్చారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ను విస్తరించేందుకు ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని, ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని చెప్పారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో తొలుత పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఆ తరువాత రైతు, మహిళ, విద్యార్థి, యువజన తదితర పార్టీ అనుబంధ విభాగాలను కూడా నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేయాలని సూచించారు. కమిటీల నిర్మాణంతోపాటు గ్రామ శాఖలను కూడా ఏర్పాటు చేసుకోవాలని, మహారాష్ట్రలోని ప్రతి పల్లెలో గులాబీ జెండా ఎగురాలని, పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ చెప్తున్న విషయాలపై చర్చ పెట్టాలని సూచించారు. పార్టీ విధానాలు, ఇతర అంశాలను త్వరలోనే మరాఠీ భాషలో కూడా ముద్రించి పంపిస్తామని, వాటిని ప్రజలకు చేరేలా చూడాలని చెప్పారు.
జనసామాన్యాన్ని బీఆర్ఎస్ చేరింది
మహారాష్ట్రలో ఇప్పటికే బీఆర్ఎస్ గురించి విసృ్తతంగా చర్చ జరుగుతున్నదని అన్నారు. కొంతమంది కవులు, కళాకారులు పార్టీ సిద్ధాంతం, విధానాలపై స్వయంగా పాటలు రాసి పాడుతున్నారని, స్థానిక కళాకారులు తమ ప్రదర్శనల్లో రైతుల కోసం బీఆర్ఎస్ చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తున్నారని, మహారాష్ట్రలో బీఆర్ఎస్ జనసామాన్యాన్ని చేరిందనడానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు. తాను నాందేడ్లో పెట్టిన సభ ప్రభావం మహారాష్ట్ర ప్రభుత్వంపై పడిందని, అందుకే రైతులకు ఏడాదికి ఆరువేల రూపాయలను ఇస్తామని ప్రకటించిందని తెలిపారు.
అయితే ఆరువేలు కాదు.. తెలంగాణ తరహాలో ఎకరానికి ఏడాదికి పదివేలు ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. తెలంగాణ తరహాలో మహారాష్ట్రలో కూడా రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటే, రైతుబంధు, రైతు బీమా ఇవ్వడంతోపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు, సాగునీటి వసతి కల్పిస్తే ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాదాలు కడుగుతామని, మహారాష్ట్రలో బీఆర్ఎస్ను విస్తరించకుండా మరో రాష్ట్రానికి వెళ్తామని, మధ్యప్రదేశ్ వైపు కదులుతామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
మహారాష్ట్రలో పార్టీ కార్యాలయాలు
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ వేగంగా విస్తరిస్తున్నదని, అనేకమంది పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని, అద్భుతమైన స్పందన ఉన్నదని కేసీఆర్ చెప్పారు. త్వరలో ముంబైలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే భవనాలను చూశామని వెల్లడించారు. పుణె, నాగ్పూర్, ఔరంగబాద్లో కూడా పార్టీ కార్యాలయాల కోసం భవనాల అన్వేషణ జరుగుతున్నదని తెలిపారు. ఒరిస్సాలో కూడా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఆ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్కు అద్భుతమైన ఆదరణ లభిస్తున్నదని చెప్పారు.
త్వరలో మహారాష్ట్రలో పర్యటిస్తా
మహారాష్ట్రలో బీఆర్ఎస్ తరఫున ఇప్పటికే రెండుసార్లు పర్యటించానని, పశ్చిమ మహారాష్ట్రకు కూడా రావాలని అక్కడివారు అడుగుతున్నారని, విదర్భకు రావాలని కోరుతున్నారని, ఆ ప్రాంతాలకు కూడా వస్తానని కేసీఆర్ చెప్పారు. అక్కడ పర్యటనను త్వరలో ఖరారు చేసుకుందామని ఇష్టాగోష్ఠికి వచ్చిన రైతు నేతలతో చెప్పారు.