KCR | నల్లగొండ : చలో నల్లగొండ సభ రాజకీయ సభ కానేకాదు.. ఉద్యమ సభ, పోరాట సభ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఒక్క పిలుపుతో పులులాగా కదిలివచ్చిన అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్లకు ఉద్యమాభివనందనాలు. ఇవాళ నల్లగొండలో చలో నల్లగొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కారణం ఏందంటే.. ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది. నాకు కాలు విరిగిపోయినా కుంటి నడకతోనే, కట్టె పట్టుకోని ఇంత ఆయాసంతో ఎందుకు రావాల్సి వచ్చింది. ఈ విషయం దయచేసి అందరూ ఆలోచించాలి అని కేసీఆర్ కోరారు.
కొందరికి ఇది రాజకీయం. మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ, రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు, నీళ్ల మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన్మరణ సమస్య. చావో రేవో తేల్చే సమస్య. ఈ మాట 24 ఏండ్ల నుంచి పక్షిలాగా తిరుగుకుంటూ మొత్తం రాష్ట్రానికి చెబుతున్నా. ఇటు కృష్ణా కావొచ్చు. అటు గోదావరి కావొచ్చు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్లు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయాయి ఈ నల్లగొండలో. లక్షా 50 వేల మంది మునుగోడు, దేవరకొండతో పాటు ఇతర ప్రాంతాల బిడ్డల నడుము వంగిపోయాయి. చివరకు ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఫ్లోరైడ్ బారినపడ్డ బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండవెడితే అయ్యా మా బతుకు ఇది అంటే కూడా పట్టించుకోలేదు. ఆనాడు పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లేరా. ఎవరూ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్లోరైడ్ రహితంగా తయారు చేశాం. ఇదే విషయాన్ని ప్రజలు కూడా చెబుతున్నారు. భగీరథ నీళ్లు వచ్చాక ఆ బాధలు పోయాయని ప్రజలు చెబుతున్నారని కేసీఆర్ తెలిపారు.