KCR | సిద్దిపేట : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు, రైతులు భారీగా తరలివెళ్లారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ రోడ్డుమార్గాన కరీంనగర్ జిల్లాకు చేరుకుని, అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులకు భరోసా ఇవ్వనున్నారు.
మరో గంటన్నరలో కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్కు కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ ఎండిన పంటలను పరిశీలించనున్నారు. రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. తర్వాత 3 గంటలకు శాభాష్పల్లి వంతెనపైకి చేరుకొని మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర జలాశయం)ను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణభవన్కు చేరుకొని మీడియాతో మాట్లాడతారు. 5 గంటలకు తిరుగు ప్రయాణమై ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రానికి చేరుకుంటారు.