BRS Party | తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, భారతీయ జనతా పార్టీకి కొమ్ముకాస్తున్న వీ6 ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి (BRS Party) నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సదరు మీడియా సంస్థలు భారతీయ జనతా పార్టీ జేబు సంస్థగా మారి అబద్ధాలు, అసత్యాలు, కట్టుకథలతో బీఆర్ఎస్ పార్టీపై, తెలంగాణ రాష్ట్రంపైన విషం చిమ్మడమే ఏకైక ఎజెండాగా పని చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశాలకు వీ6, వెలుగు మీడియా సంస్థలను అనుమతించకూడదని నిర్ణయించింది. దాంతో ఈ సంస్థలు నిర్వహించే చర్చలతో సహా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రతినిధులు ఎవరూ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. బీజేపీ గొంతుకగా మారి, విశ్వసనీయత కోల్పోయిన ఈ మీడియా సంస్థల అసలు స్వరూపాన్ని, ఎజెండాను తెలంగాణ ప్రజలు గ్రహించాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది.