హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగా ణ): బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 60 ఏండ్లల్లో జరగని అభివృద్ధిని మనం చేసుకున్నామని, జరిగిన అభివృద్ధిని మనం చెప్పుకోవాలని సూచన మేరకు పార్టీ శ్రేణులు ముందుకు కదులుతున్నాయి. బీఆర్ఎస్ గ్రామాల్లో చేసిన అభివృద్ధి ఏమిటీ? ఒక్కొక్కరికీ చేసిన సంక్షేమం ఏమిటి? అనే దానిపై గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్ర వ్యా ప్తంగా చర్చలు జరుపుతున్నారు. అభివృద్ధిని మనమే చెప్పుకోవాలని చెబుతున్నారు.
శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకర్గ కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉద్విగ్నంగా ప్రసంగించారు. ‘పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఏది చెప్పినా తూ.చ. తప్పకుండా పాటిస్తా. కేసీఆర్ అగ్గిలో దూకమన్నా దూకుతా’ అని స్పష్టం చేశారు. తనలో ఊపిరి ఉన్నంత వరకు కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్లు, ఎంపీపీ, జడ్పీటీసీ సహా పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సైతం సతీమణి నీరజారెడ్డితో సమావేశానికి హాజరయ్యారు. వంటలు చేసే దగ్గరి నుంచి మొదలుపెట్టి వడ్డించేదాకా మంత్రి వేముల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సరదాగా గడిపారు. పేరుపేరునా పలుకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎప్పు డూ అండగా ఉంటుందని చెప్పారు. మహబూబ్నగర్ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కార్యకర్తలతో కలివిడిగా గడిపారు. ప్రతి కార్యకర్త రోజుకు గంట సమయాన్ని పార్టీ కోసం కేటాయించి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు.