హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): దేశంలో సమానత్వం సాధించిననాడే నిజమైన గణతంత్రమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. గురువారం తెలంగాణభవన్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని కేకే ఆవిష్కరించారు. అనంతరం కేకే మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా సర్వమానవ కల్యాణం కోసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కలలుగన్నారని చెప్పారు. దేశంలోని ఒక శాతం ధనికుల వద్ద 40% సంపద ఉన్నదని.. ఈ అంతరాన్ని తగ్గించే ప్రయత్నాలు నామమాత్రంగానే సాగుతున్నాయని అన్నారు. ఒకే మనిషి ఒకే ఓటు విలువ రాజ్యాంగం కల్పించిన వరమని పేర్కొన్నారు.
హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. లౌకికత్వానికి ప్రతీక తెలంగాణ అని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు సుఖసంతోషాలతో ఉన్నాయని చెప్పా రు. కేసీఆర్ అనుసరించిన విధానాలు దేశవ్యాప్తంగా అమలు కావడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, పార్టీ నేతలు బండి రమేశ్, రూప్సింగ్, సుశీలారెడ్డి, ఎన్ రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్జూజు తదితరులు పాల్గొన్నారు.