నాందేడ్ : ఈనెల 5న మహారాష్ట్రలోని నాందేడ్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ బహిరంగ సభకు రానున్నారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాంకిషన్ రెడ్డి, గండ్రత్ ఈశ్వర్, బామిని రాజన్న, లోలం శ్యాంసుందర్, డాక్టర్ సుభాష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
శుక్రవారం ముద్కేడ్ తాలూకా పింపల్ కౌతా, మెండ్కా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి మహిళలు, యువకులు, వృద్ధులను కలిసి మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. దేశంలోని పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించారని వెల్లడించారు. తెలంగాణలో వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, కల్లుగీత, చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు అందుతున్నాయని పేర్కొన్నారు.
సబ్బండ వర్ణాలు ఆత్మగౌరవంతో జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆడపడుచుల పిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు సీఎం కేసీఆర్ అందిస్తున్నారని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 ఉచిత కరెంట్ అందిస్తూ వ్యవసాయాన్ని పండగలా మార్చారని పేర్కొన్నారు. దళితబందు పథకం ద్వారా దళితులకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నారన్నారు.