BRS | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హనుమకొండ జిల్లా వాసి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధీర్కుమార్ ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిషత్తు చైర్మన్గా కొనసాగుతున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా, అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహాలు, సూచనల మేరకు అధినేత కేసీఆర్ సుధీర్కుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అంతకుముందు వరంగల్ లోక్సభ పరిధిలోని పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఉద్యమ నేతకే టికెట్
తెలంగాణ ఉద్యమంలో చురుకైన వ్యక్తి.. మారెపల్లి సుధీర్ కుమార్ మాదిగ. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో 1962లో మారెపల్లి జాన్, కిరీటమ్మ దంపతులకు జన్మించిన ఈయన.. కాకతీయ యూనివర్సిటీ నుంచి బీఏఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ హెల్త్సైన్సెస్లో ఎండీ పూర్తి చేశారు. 2001లో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యత్వం తీసుకొన్న సుధీర్కుమార్.. ఉద్యమ సమయంలో మూడు సార్లు జైలుకు వెళ్లారు. ఆనాటి హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఇంటి ముట్టడి చేసినప్పుడు రెండు రోజులు జైలుకెళ్లారు. ముల్కనూర్లో ఆనాటి రాష్ట్ర మంత్రి శిల్పామోహన్రెడ్డి సందర్శనను అడ్డుకున్నందుకు మూడు రోజులు జైలు శిక్ష అనుభవించారు. దండేపల్లిలో రైల్రోకోలో పాల్గొన్నందుకు మూడు రోజులు జైలుకు వెళ్లారు. ఇవేకాక అనేక సార్లు ఉద్యమంలో ఈయనను పోలీసులు అరెస్టు చేశారు. బైండోవర్లు చేశారు. 1995-2000 వరకు భీమదేవరపల్లి మండల పరిషత్తు అధ్యక్షుడిగా, 2001-2006 మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షుడిగా పనిచేయగా.. ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిషత్తు చైర్మన్గా కొనసాగుతున్నారు. సుధీర్ కుమార్ భార్య శోభారాణి మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు.
ఉద్యమకారులు కోరిన అభ్యర్థి సుధీర్కుమార్
బీఆర్ఎస్కు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కూతురి కోసం పట్టుబట్టి పార్టీకి విధేయులుగా పనిచేసిన ఎంతోమందిని పార్టీని నుంచి బయటికి పంపారని గులాబీ శ్రేణులు ఇప్పటికే భగ్గుమంటున్నాయి. అనేక కారణాలతో కడియం శ్రీహరి కూతురు కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ప్రకటించినా, ఆ కృతజ్ఞత లేకుండా కాంగ్రెస్లో చేరినందుకు వారికి గుణపాఠం చెప్పాలంటే ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసిన నాయకుడికి, మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో సుధీర్కుమారే సరైన అభ్యర్థి అని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.