RS Praveen Kumar | మేం గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందంటూ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాగర్కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెటైర్ వేశారు. మీరు గేట్లు తెరిస్తే అక్కడికి గొర్రెలు వచ్చినయని.. అదే బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే ఇక్కడికి సింహాలు వచ్చాయని అన్నారు. నిజమైన తెలంగాణ ఉంటే ఇక్కడ ఉంటే.. తెలంగాణను మోసం చేసిన వాళ్లు అక్కడ ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్లందరూ అక్కడికి గేట్లు తోసుకుని పోతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కేకే, బాల్క సుమన్, రావుల చంద్రశేఖర్ తదితరుల సమక్షంలో బీఎస్పీ నేతలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం చారిత్రాత్మికమని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగమని వ్యాఖ్యానించారు. చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కల్పించారని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలైన ఈడీ, సీబీఐ అన్నింటినీ మోదీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని అన్నారు. రాజ్యాంగం రద్దయితే మనకు రిజర్వేషన్లు ఉండవని.. దళిత బిడ్డల బతుకు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని అన్నారు. రేవంత్రెడ్డి పాలనలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా తన పోరాటం ఆపనని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అనే ఆయుధంతో బీజేపీ, కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు.