హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలన్న డిమాండ్పై బీఆర్ఎస్ తన పోరును మరింత ఉధృతం చేసింది. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి, దానిపై చర్చించి ఆమోదించాలని కోరుతూ మంగళవారం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు, పార్టీ ఎంపీ మాలోత్ కవిత ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్ అంగీకరించలేదు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సభా కార్యకలాపాలను అడ్డుకుంటూ తమ ఆందోళనను కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా వేశారు.
సభ మధ్యాహ్నం మళ్లీ సమావేశం కాగానే బీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళనను మళ్లీ కొనసాగించారు. దీంతో గందరగోళం సభను బుధవారానికి వాయిదా వేశారు. అనంతరం పార్లమెంట్ వెలుపల నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి మహిళల పట్ల, మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల చిత్తశుద్ధి లేదని, ఉంటే కచ్చితంగా పార్లమెంట్లో చర్చకు అనుమతించి ఉండేదని పేరొన్నారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేంత వరకు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. పార్లమెంట్ లోపల, బయట ఈ విషయమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. కేంద్రానికి ఎంతమాత్రం చిత్తశుద్ది ఉన్నా, మహిళల సాధికారతపై గౌరవం ఉన్నా బిల్లుపై ఈ సమావేశాల్లోనే చర్చ చేసి ఆమోదించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అదానీ అంశంపై జేపీసీ వేయకుండా, ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేస్తూ సభలు వాయిదా వేస్తూ తప్పించుకుంటూ పోతున్నదని విమర్శించారు.