హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్చేశారు. అదానీపై చర్చకు కేంద్రం అనుమతి ఇచ్చేదాకా పార్లమెంట్ను స్తంభింపజేస్తామని తేల్చిచెప్పారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణభవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, పార్టీ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు.. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, రంజిత్రెడ్డి, బీబీ పాటిల్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలని, లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని అన్ని పార్టీలు పట్టుబడుతుంటే కేంద్రం తనకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దేశ సమస్యలపై చర్చ జరుగాలని అందరూ భావిస్తారని, కానీ తామే ముందుకొచ్చి చర్చ కోరినా కేంద్రం వెనకిపోతున్నదని మండిపడ్డారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం సమస్యలపై చర్చ కోరే హకు ప్రతి సభ్యునికి ఉన్నదని చెప్పారు. నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చి చర్చ కోరామని, విపక్షాలు కూడా తమతోపాటే నోటీసులు ఇచ్చాయని అన్నారు.
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై పార్లమెంట్ సోమవారం అట్టుడికింది. విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. జేపీసీ లేదా సుప్రీంకోర్టు కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. అయితే ఎలాంటి చర్చ జరుగకుండానే ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షాల ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ధర్నా నిర్వహించారు.