MP Nama Nageshwar Rao | హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో స్వయంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నామా, తుమ్మల మధ్య గంటల కొద్ది సుదీర్ఘంగా సహృదయ వాతావరణంలో ఆశాజనకంగా చర్చలు జరిగాయి. ఎంపీ నామా మొదటి నుంచి కూడా తుమ్మలను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంచి, బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్ని స్తున్నారు. ఆయనకు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ గెలుపు కోసం నామా తీవ్రంగా యత్నిస్తున్నారు.
అందులో భాగంగానే నామా నేరుగా హైదరాబాద్లో తుమ్మల నాగేశ్వర్ రావు స్వగృహానికి వెళ్లి, ఆయన్ని కలుసుకొని, చర్చలు జరిపి, సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను ఆయనకు తెలియజేసి, సర్ది చెప్పారు. పార్టీలోనే ఉండి, రానున్న ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించేందుకు తుమ్మలను పార్టీకి దగ్గర చేసే ప్రయత్నం చేశారు. నామా చేసిన ప్రయత్నం ఫలించినట్లేనని అంతా భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తుమ్మల తప్పక పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు. మొత్తం మీద ఎంపీ నామా తుమ్మలతో జరిపిన భేటీ సత్ఫలితం తథ్యమని భావిస్తున్నారు.