Nama Nageshwar Rao | న్యూఢిల్లీ : కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది అని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని 9 ఏండ్లుగా కేంద్రాన్ని కోరుతున్నాం. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ఎన్నోసార్లు అడిగాం. కోచ్ ఫ్యాక్టరీలను గుజరాత్, మహారాష్ట్రకు ఇచ్చి మాకు రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చారు. తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలని అడిగాం. నవోదయ విద్యాలయాల కోసం ఎన్నో సార్లు లేఖలు రాశాం. అయినప్పటికీ మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాలు ఇవ్వట్లేదు. తెలంగాణ పట్ల మోదీ సర్కార్ వివక్ష చూపిస్తోంది. చిన్న రాష్ట్రాల పట్ల మోదీ సర్కార్ తీరు సరిగా లేదు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ కూడా దేశంలో భాగమే కదా? అని ఎంపీ నామా ప్రశ్నించారు.
తెలంగాణ పథకాలను కేంద్రం అనుసరిస్తోంది నాగేశ్వర్ రావు తెలిపారు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఇతర రాష్ట్రాల్లో ఇంటింటికి మంచినీరు ఇస్తోందా..? హర్ ఘర్ జల్ పథకం కింద అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారు. మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ధాన్యం దిగుబడిలో పంజాబ్ను తెలంగాణ అధిగమించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం విపరీతంగా పెంచింది. యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోదీ సర్కార్ రద్దు చేసింది అని ఎంపీ మండిపడ్డారు.
మణిపూర్ హింసాత్మక ఘటనలు దేశానికే సిగ్గుచేటు అని ఎంపీ నామా పేర్కొన్నారు. ఈ ఘటనలతో విదేశాల్లోనూ భారత్ పరువు మంటగలిసింది. ప్రధాని మోదీ మణిపూర్కు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. మణిపూర్లో శాంతిని పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు.