హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంలాగా మార్చారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు విమర్శించారు. మోదీ పార్టీ ప్రచార కార్యక్రమంలాగా పరేడ్ గ్రౌండ్ సమావేశాన్ని వినియోగించుకున్నారని, ఇది సరైన విధానం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, రెండింటినీ కలపడం సరికాదని సూచించారు. పార్టీ ప్రచారానికి ప్రభుత్వ కార్యక్రమాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆదివారం కే కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి జరగట్లేదని ప్రధాని అన్న మాటల్లో నిజం లేదని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలో ఎకడా జరగడం లేదని చెప్పారు. పరిశ్రమలు, ఐటీ, విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, సంక్షేమం, రోడ్లు, వ్యవసాయం, విద్యుత్తు ఇలా అనేక రంగాల్లో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రులు, శాఖల నివేదికలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. విభజన హామీలు ఏమయ్యాయి? కేంద్ర ప్రభుత్వ పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయి? అని కేకే నిలదీశారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఏ నిధులు వినియోగించుకోలేదో చెప్పాలని ప్రధాని మోదీ, బీజేపీ నేతలను ఆయన ప్రశ్నించారు. 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ.. ఆ రాష్ట్రానికి వెళ్లిన ప్రధానమంత్రి మన్మోహన్సింగ్కు ఎందుకు స్వాగతం పలుకలేదని నిలదీశారు.
బీజేపీకి అంత అహంకారం పనికిరాదు
కేంద్రంలో మెజారిటీ ఉన్నదనే గర్వం, అహంకారంతో బీజేపీ వ్యవహరిస్తున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిదికాదని కేశవరావు హితవుపలికారు. సమాఖ్య స్పూర్తిని కొనసాగించాలని మోదీకి సూచించారు. రైల్వేశాఖ కార్యక్రమాల్లో ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీల పేర్లు కచ్చితంగా పెడుతారని కానీ, శనివారం నాటి ప్రధాని కార్యక్రమంలో ఎక్కడా ఎంపీల పేర్లు లేవని మండిపడ్డారు. గతంలో ప్రధాని మోదీ భారత్ బయోటెక్కు వచ్చినప్పుడు స్వాగతం పలకడానికి, కంపెనీ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ను రావద్దని అన్నారని కేకే గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు కేంద్రం నయా పైసా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు.
ఆదరణను ఓర్వలేకనే: ఎంపీ వెంకటేశ్
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రధాని మోదీ తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని ఎంపీ వెంకటేశ్ నేతకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని అంటే ప్ర+ అదానీ=ప్రధానిగా మారిందని, దేశాన్ని అదానీకి దోచుపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణపై, సీఎం కేసీఆర్ కుటుంబంపై విషం కక్కడానికే ప్రధానమంత్రి అధికారిక వేదికను వినియోగించుకున్నారని మండిపడ్డారు. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం రెండింతలు పెరిగిందని అన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.12లక్షలు ఉంటే 2022లో 2.75లక్షలకు చేరిందని, అదే ఇండియా తలసరి ఆదాయం 2014లో రూ.79 వేలు ఉంటే 2022 నాటికి 1.12లక్షలు మాత్రమే అయిందని వివరించారు. రాష్ట్రాల పన్నుల వసూళ్లలో గుజరాత్ ఎక్కడ ఉన్నదో చూసుకోవాలని మోదీకి ఎంపీ సూచించారు. ఉత్తరప్రదేశ్లో 8.6 శాతం, మధ్యప్రదేశ్లో 7 శాతం, కర్ణాటకలో 5.7 శాతం, గుజరాత్లో మాత్రం కేవలం 2.6 శాతం మాత్రమేనని వివరించారు. ఇవి ఆర్బీఐ లెక్కలేనని గుర్తు చేశారు.
అవును.. తెలంగాణ అంతా కేసీఆర్ కుటుంబమే: కేఆర్ సురేశ్రెడ్డి
తెలంగాణలో కుటుంబ పాలన సాగుతున్నదని అంటున్నారని, నిజమే తెలంగాణ ప్రజలు మొత్తం కేసీఆర్ కుటుంబమేనని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి మోదీ ప్రసంగాల్లో తెలంగాణపై ఓర్వలేనితనం కనిపిస్తున్నదని మండిపడ్డారు. మోదీ తెలంగాణపై విషం కకుతూనే ఉన్నారని, హైదరాబాద్ వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సిఫార్సులు ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు ఎందుకు నిధులు ఇయ్యలేదని ప్రశ్నించారు.