పెద్దపల్లి, మార్చి 27: ‘కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. ఇచ్చిన వాగ్దానాల అమలు పక్కన పెడితే.. రైతులకు కనీసం సాగునీరు ఇవ్వకుండా ఏడ్పిస్తున్నది. ఆ పాపం ఊరికే పోదు.. కాంగ్రెస్ సర్కార్కు తప్పకుండా రైతుల ఉసురు ముడ్తది’ అని బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
బుధవారం పెద్దపల్లి మం డలం భోజన్నపేట, చీకురాయి గ్రామాల శివారులో సాగునీరందక ఎండిన వరిపంటలను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొమ్మిదిన్నరేండ్లలో రైతులకు ఏనాడూ సాగునీటి కష్టాలు రానివ్వలేదని, ఎక్కడా ఒక్క ఎకరం ఎండిపోకుండా నీరందించామని చెప్పారు.
కాంగ్రెస్ మూడు నెలల పాలనలోనే ముప్పు తిప్పలు పెడుతున్నదని దుయ్యబట్టారు. ఎండిన ప్రతి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ నెల 30, 31 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన దీక్షలు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్సింగ్ పాల్గొన్నారు.