మంథని, ఏప్రిల్ 16: అసెంబ్లీ ఎన్నికల ముందర నిరుద్యోగులకు మెగా డీఎస్సీ అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్.. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి దానినే మెగా డీఎస్సీ అంటారా? అని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్స్లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొప్పుల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ దరఖాస్తుల ఫీజులు రూ.200 ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని ఏకంగా రూ.1000కి పెంచిందని మండిపడ్డారు. ఒక్క నిరుద్యోగి 3 పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే రూ.3 వేల వరకు ఖర్చు అవుతున్నదని, అంత డబ్బు ఆ నిరుద్యోగి ఎలా చెల్లిస్తాడని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆగస్టు 15 నుంచి రూ.2 లక్షల రుణమాఫీని చేస్తామని మోసపు ప్రకటనలు చేస్తున్నదని, కాంగ్రెస్ మోసాలను ప్రజలు గమనించాలని సూచించారు.