హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్ ముందస్తు గుర్తింపునకు ‘నేషనల్ మాస్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్’ ప్రారంభించాలని రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ బీ పార్థసారథిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నివారణకు కేంద్రం పకడ్భందీ చర్యలు చేపట్టాలని కోరారు. దేశం క్యాన్సర్ హెల్త్ ఎమర్జెన్సీ దిశగా సాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో స్క్రీనింగ్ ప్రక్రియకు వసతులు లేకపోవడం, ప్రజల్లో క్యాన్సర్ ముందస్తు లక్షణాలపై అవగాహన లేకపోవడం సమస్యగా మా రిందని పేర్కొన్నారు. మన దేశంలో క్యాన్సర్ చికిత్స, మందులు ఖర్చు తో కూడుకోవడంతో పేదలు ఆ స్థాయిలో డబ్బు వెచ్చించలేకపోతున్నారని వివరించా రు. క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నందున మెడికల్, సర్జికల్, రేడియేషన్ అంకాలజిస్టుల సంఖ్య పెంచాలని కోరారు.
దేశంలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ చికిత్స సెంటర్లు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లో ఉన్నాయని పార్థసారథిరెడ్డి గుర్తు చేశారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పేషెంట్లు దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స తీసుకోవడం కష్టతరంగా మారుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాట్ ఫర్ ప్రాఫిట్’ క్యాన్సర్ దవాఖానలకు కేంద్రం కొంత వెసులుబాటు కల్పించాలని కోరారు.
సామాజిక బాధ్యతగా హైదరాబాద్లో 1500 బెడ్లతో సింధు హాస్పిటల్ నిర్మించినట్టు పార్థసారథిరెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యులంతా ఒకసారి ఈ దవాఖానను సందర్శించాలని ఆహ్వానించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో క్యాన్సర్ బాధితులు ఉంటే సింధు దవాఖానకు రిఫర్ చేయాలని ఆయన కోరారు. వాళ్లందరికీ ఉచితంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఉచిత చికిత్స పొందాలనుకునేవారు 9394010215 నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు.