Madusudhana Chary | హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి మండిపడ్డారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. ఏ ప్రతిపాదికన వీరిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారో గవర్నర్ స్పష్టం చేయాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం గవర్నర్కు లేదని ఆయన స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పంపాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై 31వ తేదీన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, రాజేశ్వరరావు పదవీకాలం ముగియడంతో వారి స్థానాల్లో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
సంగారెడ్డికి చెందిన కుర్రా సత్యనారాయణ జనతాపార్టీ, బీజేపీలో పనిచేశారు. 1999లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణ 2018 వరకు బీజేపీలోనే ఉన్నారు. ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిరసనగా రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ దాసోజు శ్రవణ్ బీసీ వర్గాల బలమైన గొంతుకగా ఎదిగారు. ప్రజారాజ్యంలో కొంతకాలంపాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి పలు హోదాల్లో పనిచేశారు. తెలంగాణ కోసం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి బీఆర్ఎస్ సమర్పించిన చారిత్రక నివేదిక రూపకల్పన బృందంలో సభ్యుడిగా పనిచేశారు.