MLC Kavitha | ఖమ్మం : ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించిన బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్ ను ఖమ్మం జైలులో శనివారం నాడు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ… ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. అక్రమ కేసులతో కేసిఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, కానీ కెసిఆర్ ని, కెసిఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరికి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా తమను ఆపలేరని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్ని, మోసాలన్నీ ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయాయని, రైతులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయని తెలిపారు.
14 నెలల పాలనలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అందరికీ తెలిసిపోయిందని, ఆ భయంతోనే ఎవరిని పడితే వాళ్లను కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని చెప్పారు. గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు సురేందర్ పై అక్రమ కేసు నమోదు చేసి జైలు పంపారని, ప్రభుత్వం నడపడం చేతగాక, పథకాలు అందించడం చేతకాక వైఫల్యాలను కప్పిపెట్టుకుంటామంటే కుదరదని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంట పడుతూనే ఉంటామ, అక్రమ కేసులకు తలొగ్గేదే లేదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు.