జోగులాంబ గద్వాల : అలంపూర్లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికై సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆలయానికి ఇతర రాష్ట్రాల నుండి రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామని కవిత పేర్కొన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా అలంపూర్లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో అన్నిరకాలుగా శాంతియుత వాతావరణం ఉంటే, దేశంలో మాత్రం విపరీత ధోరణితో ఉన్న నాయకత్వం ఉందని, విపరీత ధోరణులను పక్కనపెట్టి, సహృదయంతో ఆలోచించే నాయకత్వం రావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశామని కవిత తెలిపారు.
తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమకూ అమలుచేయాలని ఇతర రాష్ట్రాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా గతంలో అలంపూర్ ప్రాంతానికి నీరు వచ్చేది కాదని, కానీ ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా మారుమూల గ్రామాల్లో సైతం నీటి సదుపాయం కల్పించామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆర్డీఎస్ ప్రాజెక్టు పాదయాత్ర ద్వారా అలంపూర్ ప్రాంతాన్నంతా కదిలించి ఉద్యమంలో నడిపించారని గుర్తు చేశారు. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో తుమ్మిళ్ల లిఫ్ట్, ఆలంపూర్ లిఫ్ట్లను బాగు చేసుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఒకప్పుడు పాలమూరు ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, కానీ ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుండి కూలీలు పాలమూరుకు వచ్చి పనిచేస్తున్నారని కవిత గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాల జడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, కార్పొరేషన్ ఛైర్మన్లు మేడె రాజీవ్ సాగర్, సాయిచంద్ పాల్గొన్నారు.