MLC Kavitha | న్యూఢిల్లీ : ఢిల్లీ గడ్డ మీద చేపట్టిన ధర్మపోరాటం దిగ్విజయంగా సాగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు( Women Reservation Bill ) కోసం బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha ) చేపట్టిన నిరాహార దీక్ష( Hunger Strike ) విజయవంతం అయింది. సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ కవితకు ఎంపీ కే కేశవరావు( MP Keshava Rao ) నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం మా పోరాటం కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదు. మోదీ సర్కార్ తలచుకుంటే ఈ బిల్లు పాసవుతుంది. డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు పోరాడుతూనే ఉంటాము. రాష్ట్రపతికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రారంఇంచిన ఈ పోరాటం ఇంకా ఉధృతమవుతుంది. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం.. సాధించి తీరాలి అని కవిత స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన దీక్షకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీక్షకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఢిల్లీ మహిళా నేతలకు, విద్యార్థి నేతలకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు కవిత. ఈ దీక్షకు మొత్తం 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.
కవిత దీక్షలో ఆప్ నేతలు సంజయ్ సింగ్, చిత్ర సర్వార, నరేష్ గుజ్రాల్ (అకాలీదళ్) శివసేన ప్రతినిధులు, అంజుమ్ జావేద్ మిర్జా (పీడీపీ), షమీ ఫిర్దౌజ్ (నేషనల్ కాన్ఫరెన్స్), సుస్మితా దేవ్ (టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్ (ఎన్సీపీ), కే.నారాయణ (సీపీఐ), సీతారాం ఏచూరి (సీపీఎం), పూజ శుక్లా (ఎస్పీ), శ్యామ్ రాజక్ (ఆర్ఎల్డీ), కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ సహా పలు విపక్ష పార్టీల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.