BRS MLC Kavitha | గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకు కాంగ్రెస్ పాలకులు ఆడబిడ్డలను ఖాకీలతో కొట్టించడం అమానుషం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండి పడ్డారు. నెలకు రూ.18 వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలియజేసిన ఆశా వర్కర్లను దారుణంగా పోలీసులు కొట్టారని ఆరోపించారు. ఆశా వర్కర్లను బలవంతంగా పోలీస్ వ్యాన్లలో ఎక్కించిన తీరు.. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న నిర్బంధాలు, అణచివేతకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్ అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. `అధికారం శాశ్వతం కాదు. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో, బతుకమ్మ ఆడే చేతులతోనే, ఆడబిడ్డలు కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడటం ఖాయం` అని స్పష్టం చేశారు.