హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): పార్లమెంటులో సంపూర్ణ మెజార్టీ ఉన్న బీజేపీ సర్కారు మహిళా బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహిళా బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటాలను ఉధృతం చేస్తామని, రైతుల తరహాలో ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ సాధన కోసం భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో బుధవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చి బిల్లుకు ఆమోదం తెలిపే దాకా అనుసరించాల్సిన వ్యూహరచన చేయడమే సమావేశం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం కోసం అనుసరించాల్సిన కార్యాచరణ రూపొందించామని, ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నామని వివరించారు.
పార్లమెంటు బయట బిల్లుకు మద్దతు కూడగట్టడం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. పార్లమెంటు లోపల కూడా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు, జీరో అవర్లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టవచ్చని సూచించారు. పార్లమెంటు బయట ఎలా కొట్లాడాలో రైతులు తమకు మార్గం చూపించారని, వారి నుంచి స్ఫూర్తి పొందేందుకే గుర్నాంసింగ్ను సమావేశానికి ఆహ్వానించామని వివరించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మహిళలు చేసే పోరాటానికి ప్రతి పార్టీ, ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. బిల్లు ఆమోదం పొందే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉద్ఘాటించారు.
సమావేశానికి అపూర్వ స్పందన
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఢిల్లీలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశానికి అపూర్వ స్పందన లభించింది. 13 రాజకీయ పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నేతలు హాజరై మద్దతు పలికారు. సమావేశంలో జేజేఎం ఎంపీ మహువా మాంఝీ, డీఎంకే ఎంపీ తమిళచీ, జనతాదళ్ నుంచి మనోజ్షా, ఎస్పీ నుంచి హసన్, సీపీఐ నుంచి కే నారాయణ, బినాయ్ విశ్వం, సంతోషి, ఆప్ ఎంపీ రాఘవ్చద్దా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆర్ఎల్డీ జాతీయ మహిళా అధ్యక్షురాలు ప్రతిభాసింగ్, ఆర్ఎస్పీ నుంచి ప్రేమ్చంద్రన్, దినేశ్, ఆజాది పార్టీ నుంచి హర్జిత్సింగ్ పట్టీ, ఆర్ఎల్డీ అధికార ప్రతినిధి భూపేంద్రచౌదరి, నేషనల్ డిసెబులిటీ నెట్వర్క్ ప్రతినిధి శ్రీనివాస్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝౌ, బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత, ఎస్పీ ఎంపీ ఎస్టీ హసన్, బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాంసింగ్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి విష్ణువర్దన్రెడ్డి, రేఖాబౌరా, సీపీఎం నుంచి జాన్, వీసీకే పార్టీ ఎంపీ తిరుమావలన్ తదితరులతోపాటు పలు యూనివర్సీటీల విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.
బిల్లు పెడితే ఆమోదించనిదెవరు?
మహిళా బిల్లు న్యాయమైనది. మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత పోషిస్తున్న ప్రాత అభినందనీయం. వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో సీపీఐ ఎంపీ గీతాముఖర్జీ దేశమంతా తిరిగి మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసి పార్లమెంటుకు నివేదిక ఇచ్చారు. ఆ తరువాత దేవెగౌడ హ యాంలో కొన్ని రాజకీయ పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. మన్మోహన్సింగ్, దేవెగౌడ, గుజ్రాల్ ప్రధానులుగా ఉన్నప్పుడు ఆయా ప్రభుత్వాలకు పూర్తి స్థాయి సంఖ్యాబలం లేదు. కానీ మోదీ ప్రభుత్వానికి పూ ర్తిస్థాయి మెజారిటీ ఉన్నది. మోదీ సర్కారు బిల్లు తేవడానికి ఇష్టపడటం లేదు. బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు తెస్తే సమర్థిస్తాం.
– సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ
మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిందే
ఒక వైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తకువ ఉండటం మంచిగా అనిపించడం లేదు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్ బిల్లు రావాల్సిందే. ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి అండగా ఉంటాం. -జేఎంఎం ఎంపీ మహువా మాఝి
పోరాటం ఉధృతం చేయాలి
అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అటువంటి మహిళా శక్తికి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టరు? దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల ప్రతినిధులు మహిళా బిల్లు కోసం పోరాటాలు చేయాలి.
– గుర్నాంసింగ్ చడూనీ, బీఆర్ఎస్ కిసాన్సెల్ జాతీయ అధ్యక్షుడు
జెమ్స్ మూవ్మెంట్ రావాలి
మేము విద్యార్థి దశ నుంచే మహిళా సాధికారత కోసం ఉద్యమిస్తున్నాం. మహిళా బిల్లు కోసం మూడు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాం. విద్యాసంస్థల్లో జెమ్స్ మూవ్మెంట్స్ (జండర్ ఈక్వాలిటీ మూవ్మెంట్స్) రావాల్సిన అవసరం ఉన్నది. మహిళా బిల్లు కోసం ప్రతి ఒక్కరూ గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైంది.
–రేఖాబౌరా, మహిళా హక్కుల కార్యకర్త
బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనం
మహిళా బిల్లు కోసం ఉద్యమం చేపట్టిన ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు. ఎన్నికల్లో హామీ ఇచ్చినవిధంగా మహిళా బిల్లును ఆమోదించకపోవడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనం. ఒక బంజారా మహిళకు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. అది నాకు గర్వకారణం. తెలంగాణలో అన్ని స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు.
– బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత
అవగాహన కల్పించాలి
రిజర్వేషన్లపై మహిళల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యం గా దీనిపై గ్రామీణ మహిళలకు అవగాహన లేదు. వారిని చైతన్యవంతులను చేయాలి. మద్దతు కూడగట్టాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలి.
– ఆర్ఎల్డీ పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్
మహిళా బిల్లుపై చర్చ శుభపరిణామం
కేంద్రంలోని బీజేపీ సర్కారు మహిళలే కాదు ఎవరి సంక్షేమాన్నీ పట్టించుకోవడం లేదు. ఏ పార్టీ కూడా మహిళా బిల్లుపై చర్చించడం లేదు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్సీ కవిత గొప్ప చొరవ తీసుకున్నారు. చర్చ మొదలుపెట్టారు. అందుకు కృతజ్ఞతలు.
– హర్యానా ఎంపీ భూపేంద్రచౌదరి
బిల్లు ఆమోదం పొందకపోవడంపై చర్చ
ఎమ్మెల్సీ కవిత గొప్ప చర్చకు తెరలేపారు. మహిళా బిల్లును మరోసారి చర్చకు తేవడం అభినందనీయం. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తాము మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకం కాదని చెప్తున్నాయి. కానీ, ఆ బిల్లు మాత్రం ఆమోదం పొందడం లేదు. కారణాలేమిటి? అనే అంశంపై చర్చ జరగాలి.
– ఎంపీ ప్రేమచంద్రన్
ప్రగతి రథానికి స్త్రీ, పురుషులు చక్రాలు
సమాజ ప్రగతి రథానికి స్త్రీ, పురుషులిద్దరూ చక్రాల లాంటి వారు. మహిళలు అంటే ఎవరో కాదు. మన తల్లి, చెల్లి, భార్య.. మొత్తంగా సగం కుటుంబం. వారు వెనకబడిపోతే మన కుటుంబం ఎలా ముందుకు పో తుంది. కాబట్టి మహిళా బిల్లును ఆమోదించాలి.
– అమర్చౌదరి, యాంటీ అడిక్షన్ ప్రొడక్షన్ కంపెనీ ప్రతినిధి
143 దేశాల కంటే వెనుకే
ఎమ్మెల్సీ కవిత ఉద్యమాన్ని సమర్థిస్తున్నాం. మహిళల రాజకీయ ప్రాతినిధ్యంలో భారత్ 143 దేశాల కంటే వెనకబడింది. ఇప్పటికైనా మహిళా బిల్లును తీసుకొనిరావాలి.
–ఆప్ ఎంపీ రాఘవ్చద్దా
మహిళలతోనే సూపర్పవర్
మహిళలకు తగిన వాటా కల్పించకుండా, గౌరవం ఇవ్వకుండా ఏ దేశం కూడా సూపర్పవర్ కాబోదు. దేశం అభివృద్ధి చెందాలంటే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి. మహిళా బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చూపుతున్న చొరవ అభినందనీయం.
–ఎస్పీ ఎంపీ ఎస్టీ హసన్
పోరాటంలో కలిసి నడుస్తాం
వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం అవసరం. మహిళా బిల్లు కార్యరూపం దాల్చడానికి కవిత చేసే పోరాటంలో మేం కలిసి నడుస్తాం.
– డీఏంకే ఎంపీ తమిళాచి తంగపాండ్యన్
పితృస్వామ్య వ్యవస్థనే అడ్డంకి
మహిళా బిల్లు అమోదానికి ప్రధానంగా పితృస్వామ్య వ్యవస్థలే అడ్డంకిగా మారాయి. 21వ దశాబ్దంలో కూడా మహిళా హకులు సాధించకపోవడం విచారకరం. మహిళా బిల్లు ఆమోదానికి ఎప్పుడూ అండగా నిలబడతాం.
– సీపీఐ ఎంపీ బినోయ్ బిశ్వం
సగభాగం ఎందుకివ్వరు?
అధ్యయనం, పరిశోధన, ఆరాధన, ఇలా ప్రతీ రంగంలో మహిళలు తమ చైతన్యాన్ని నిరూపించుకున్నారు. సమాజంలో సగ భాగం ఉన్న మహిళలకు సమాన అవకాశాలు ఎందుకు ఇవ్వరు?
–శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
దేశవ్యాప్త ఉద్యమం నిర్మించాలి
సమాజంలో దివ్యాంగులపై తరహాలోనే మహిళలపై కూడా వివక్ష కొనసాగుతున్నది. దివ్యాంగుల తరహాలోనే మహిళలు కూడా కమ్యూనిటీ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది.
–శ్రీనివాసులు, నేషనల్ డిజేబిలిటీ నెట్వర్క్ ప్రతినిధి