Speaker Prasad Kumar | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ను కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానంపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ను సమర్పించేందుకు బీఆర్ఎస్ ఎమ్యెల్యేల బృందం స్పీకర్ను కలిసేందుకు ఆదివారం అపాయింట్మెంట్ కోరింది. సాయంత్రం 6 గంటలకు కలిసేందుకు బీఆర్ఎస్ బృందానికి స్పీకర్ సమయం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బంగారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేల నివాస సముదాయంలోని స్పీకర్ నివాసానికి నిర్దేశిత సమయానికి వెళ్లారు. అయితే, స్పీకర్ ఇంట్లో లేకపోవడంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 వరకు అక్కడే నిరీక్షించారు. తాము ఎదురుచూస్తున్నామని పలుమార్లు ఫోన్ చేసినా స్వీకర్ స్పందించలేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. ఈ సందర్భంగా స్పీకర్ ముందు అపాయింట్మెంట్ ఇచ్చి కలవకపోవడం బాధాకరమని పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ తమను కలవలేదని ఆరోపించారు. సోమవారం మరోసారి కలిసి ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేసే పిటిషన్ను సమర్పిస్తామని చెప్పారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా వీరిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ‘దానం నాగేందర్ పంజాగుట్ట చౌరస్తాలో దివాన్జీ దగ్గర బీడీలు అమ్ముకునేటోడు’ అంటూ రేవంత్రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు పేరడీగా ‘దానం నాగేందర్ గాంధీభవన్ దగ్గర ఇప్పుడు బీడీలు అమ్ముకుంటాడా?’ అని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఎంపీ రంజిత్రెడ్డిపై ‘గుడ్ల వ్యాపారం చేసే గుండుగాడు’ అని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.