Harish Rao | రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గన్పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
వరి వేయొద్దని, పంట మార్పిడి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే చెబితే.. ఆ మాటలు నమ్మి రాష్ట్రంలో రైతులు సుమారు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. తీరా పంట చేతికి వచ్చాక ఆ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతోందని అన్నారు. మొక్కజొన్న మార్కెట్లకు రావడం మొదలై ఇప్పటికే 15 రోజులు అవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం దారుణమని మండిపడ్డారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మొక్కజొన్నకు మద్దతు ధర రూ. 2400 ఉంటే.. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు బయట మార్కెట్లో దళారులకు రూ. 1600 నుంచి 1700లకే అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పదిహేను రోజులుగా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం చూస్తుంటే ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థమవుతోందని అన్నారు. పంట అంతా దళారుల పాలైన తర్వాత, ఆ దళారుల దగ్గర ఎక్కువ ధరకు కొని వాళ్లకు మేలు చేయాలని ప్రభుత్వం చూస్తోందా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందా? దళారులకు మేలు చేస్తుందా? అనేది స్పష్టం చేయాలన్నారు.
ఒకవైపు మద్దతు ధర లేక నష్టపోతుంటే, మరోవైపు అకాల వర్షాలకు మార్కెట్ యార్డుల్లో, కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న తడిచిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. గత రెండు రోజులుగా కురిసిన వడగండ్ల వానలకు మొక్కజొన్న, మామిడి సహా ఇతర పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని పేర్కొన్నారు. బడ్జెట్లో పంటల బీమా గురించి గొప్పగా ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని చెప్పారు. ఈ ప్రభుత్వం అటు పంటల బీమా అమలు చేయదు, ఇటు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వదని మండిపడ్డారు.

గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం కేవలం మాటల్లో చెబుతున్నదే తప్ప, ఇప్పటివరకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ నిధులను విడుదల చేయడం లేదని అన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వెంటనే నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. తక్షణమే ఎన్యూమరేషన్ చేసి నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నారు.