Telangana | హనుమకొండ చౌరస్తా : బీజేపీ అంటేనే ‘భారత జనులను దోచుకునే’ పార్టీ అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్( Dasyam Vinay Bhasker ) అన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు( Gas Cylinder ) పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హనుమకొండ జిల్లా( Hanumakonda Dist ) హనుమకొండ చౌరస్తాలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద మహిళలతో కలిసి రెండో రోజు నిరసన చేపట్టారు. వంటవార్పు చేపట్టారు.
అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘మోదీ హఠావో దేశ్కో బచావో’ నినాదంతో ముందుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భార్య, పిల్లలు, కుటుంబం ఉంటే ఎవరికైనా బాధలు తెలుస్తాయి. ఒంటరి పురుషులకు ఏ బాధ తెలియదు, బాధ్యతలు ఉండవు అందుకే అడ్డగోలుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నాడు. గతంలో కట్టెలపొయ్యి మీద వంట చేస్తుంటే పొగ కారణంగా మహిళలకు కళ్లల్లో నీళ్లు వచ్చేవి.., కానీ, ఇప్పుడు పెరిగిన గ్యాస్ ధరల కారణంగా వంట చేయకముందే మహిళల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయన్నారు. మహిళల ఏడుపుకు కారణమైన మోదీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి దేశ మహిళల ఏడుపు తగులుతుందని, మహిళల కన్నీళ్లలో బీజేపీ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. అదానీ, అంబానీ మీద ఉన్న ప్రేమలో పావలా వంతైనా దేశ ప్రజల మీద ఉంటే బాగుండేదన్నారు. మోదీకి పోయే కాలం వచ్చింది కాబట్టే.. అన్ని ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.