హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షాలకు ప్రతిరూపంగా ఉన్న ప్రగతిభవన్ను పేల్చివేయాలన్న రేవంత్రెడ్డిపై పీడీయాక్టు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. వెర్రికూతలు కూస్తున్న రేవంత్రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వెంటనే స్పందించాలన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు మీరు రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? ఒకవేళ సమర్థిస్తే.. మీ పార్టీ స్టాండ్ కూడా అదేనా? లేదా ఆయన మాటలను ఖండిస్తే.. ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ తుగ్లక్ వ్యాఖ్యలు చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ తన అహింసా సిద్ధాంతాన్ని మార్చుకుందా? అనే అనుమానం కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్పార్టీ ప్రభుత్వ ఆఫీస్లను కూడా పేల్చాలని డిమాండ్ చేయగలవా? నీకంత దమ్ముందా? నక్సలిజంపై నిషేధం విధించిన మీ పార్టీ వాళ్లే.. వాళ్లతో ఆఫీసులు పేల్చమని ఎలా ఉసిగొల్పుతారు? అని ప్రశ్నించారు.
మీరు తక్షణమే తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పకపోతే నీకు చిప్పకూడు తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు. యాత్ర చేసే ప్రాంతంలో ప్రజలు చూడ్డానికి కూడా వస్తలేరని.. పత్రికల్లో రావాలని విధ్వంసాల గురించి మాట్లాడుతున్నవ్. గతంలో ఏ రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడలేదు. తెలంగాణ సుభిక్షంగా ఉందో.. రాజకీయాలు కూడా సుభిక్షంగా ఉండాలంటే రేవంత్పై పీడీయాక్టు నమోదు చేయాలి. ములుగు, నర్సంపేట భగ్గుమంటున్నది. వారి నిరసనలు, రాస్తారోకోలు, శవయాత్రలకు నువ్వు సమాధానం చెప్పాలి. రేవంత్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నైతిక బాధ్యత వహించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.