Palla Rajeshwar Reddy | హైదరాబాద్ : ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టం చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పల్లా మీడియాతో మాట్లాడారు.
నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో అధికంగా పంట నష్టం జరిగింది. అకాల వర్షాలు వచ్చినప్పుడు, పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్ర పరిశీలన చేసి, రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లి రైతులకు భరోసా కల్పించాలి. కానీ ఇవాళ ఉన్న కాంగ్రెస్ పాలకులు.. ప్రతిపక్షాలను తిడుతున్నారు తప్ప.. వ్యవసాయం, రైతులను పట్టించుకోవడం లేదు. కనీసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడా విజిట్కు వెళ్లలేదన్నారు.
అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక కూడా అబద్దాలు కొనసాగిస్తున్నారు. చాలా దురదృష్టం. వారు చేయాల్సిన పని చేయకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం పంట నష్టం కింద రూ. పదివేలు ఇవ్వలేదని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనిని చెప్పకపోవడం మంచిది కాదు. ఇప్పుడు అబద్దాలు మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వర్ రావు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను మెచ్చుకున్నారు. ఇవాళ రైతులకు చేయూతనివ్వాల్సింది పోయి గత ప్రభుత్వంపైకి నెపం నెట్టడం సరికాదన్నారు.
నాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల, పరిగి వెళ్లి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులకు భరోసా ఇచ్చి రూ. 151 కోట్లు విడుదల చేసి డబ్బులు చెల్లించాం. రెండోసారి నష్టం జరిగిందని చెప్పి సీఎం కేసీఆర్ స్వయంగా ఖమ్మం జిల్లా, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. అప్పుడు కూడా పంట నష్టం కింద రూ. 10 వేలు ఇచ్చాం. ఆనాడు 3 వేల గ్రామాల్లో 2 లక్షల 79 వేల మంది రైతులకు 3 లక్షల 4 వేల ఎకరాలకు పంట నష్టం జరిగిందని అంచాన వేశారు. అందుకు సాయం రూ. 304 కోట్లు కావాలని చెప్పి జీవో నంబర్ 19ని విడుదల చేసింది. ఆ తర్వాత జీవో 24 ద్వారా రూ. 304 కోట్ల విడుదలకు బడ్జెట్ రీలిజ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం అని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం 2 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. అంచాన వేసి వెంటనే బీఆర్వో రిలీజ్ చేయండి. రైతులకు భరోసాగా ఉండండి అని ఎమ్మెల్యే సూచించారు.
రైతుబంధు కోసం 7 విడతల్లో రూ. 75 వేల కోట్లు ఇచ్చాం. ఆ నగదు అంతా రైతుల ఖాతాల్లో జమ అయింది. 8వ విడత కింద రూ. 7500 కోట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తే.. కాంగ్రెస్ అడ్డుపడ్డది. ఇప్పటికీ చాలా మంది రైతులకు రైతుబంధు ఇవ్వలేదు. ఆ రైతుబంధు పైసలు ఎక్కడికి పోయాయి. రైతుబంధు పైసలతో కాంగ్రెస్ మంత్రులు లబ్ది పొందారు. గత మూడు నెలలుగా 100 రోజుల్లో రూ. 16,500 కోట్లు అప్పులు తెచ్చారు. రైతుబంధు నిధులు రూ. 7,500 కోట్లు, రూ. 16,500 కలిపితే మొత్తం రూ. 24 వేల కోట్లు ఎక్కడికి పోయాయి. రైతుభరోసా కింద 15 వేలు ఇస్తామన్నారు. అది కూడా అమలు చేయలేదు. అది పక్కన పెడితే గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు ఇవ్వాలని రైతుల తరపున డిమాండ్ చేస్తున్నాం అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.