జర్నలిస్టులకు రూ.100 కోట్లు కేటాయించింది.. అంగన్వాడీలకు అన్నం పెట్టింది.. దళితబంధు, రైతుబంధుకు శ్రీకారం చుట్టింది.. సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చింది ప్రగతిభవనే.
– పల్లా రాజేశ్వర్రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): గవర్నర్తో ముప్పై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారని, అరచేతిలో వైకుంఠం చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. చట్టసభల్లో అబద్ధాలు చెప్పడం తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. మార్పు అంటే నంబర్ ప్లేట్లు మార్చడం కాద ని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. ‘వ్యవసాయవర్సిటీ భూములు తీసుకోవద్దని విద్యార్థులు ఆందోళన చేస్తుంటే సిగలు పట్టుకుని ఈడ్చుకెళ్లారు.
కాంగ్రెస్ నేతలు ఓయూకు వెళ్తే అరెస్ట్లు చేస్తున్నారు. భవనాల పేర్లు మా ర్చడం, ధరణిని భూమాతగా పేరు మార్చడమే మార్పా?’ అని నిలదీశారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బీఆర్ఎస్ పక్షాన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని ఎవ్వరూ ఇవ్వలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని, కేసీఆర్ సాధించారని స్పష్టంచేశారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ, నెహ్రూ, పటేల్ పోరాడింది ఎంత నిజమో.. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడింది అంతే నిజమని చెప్పారు. ‘కాంగ్రెస్ ఇచ్చింది. సోనియా ఇచ్చింది.. అంటున్న వారు మనం స్వాతంత్య్రం తెచ్చుకోలేదు.. బ్రిటీషువాళ్లే ఇచ్చారంటే ఒప్పుకుంటారా?’ అని ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీల గురించి గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పారని పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గ్యారెంటీలో ఒక పథకాన్ని మాత్రమే అమలు చేశారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, 13 అంశాలకు బడ్జెట్లో ఎంత కేటాయిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. 13 హామీలిచ్చి రెండు పూర్తి చేశామని చెప్పుకోవడం సరికాదని చురకలేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.20 కోట్లు ఖర్చు చేస్తే రూ.60 కోట్ల ప్రచారం చేసుకున్నారని ఎద్దేశా చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేవని, హామీ ల ఊసే లేదని దుయ్యబట్టారు. కౌలురైతులను విస్మరించారని విమర్శించారు. ప్రమాణ స్వీ కారం రోజే రైతు రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. రైతుభరోసా సాయం పెంచలేదని, వరికి 500 బోనస్ను యాసంగికైనా ఇస్తారా? మోసగిస్తారా? అని నిలదీశారు. ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ప్రగతిభవన్ కంచెలు బద్దలు కొట్టామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ముందు కొత్త కంచెలు పెట్టిందని, పోలీసు గస్తీని పెంచిందని పల్లా రాజేశ్వర్రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రగతిభవన్ గతంలో కూడా ప్రజాభవనేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రగతిభవన్లో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని వివరించారు. సీఎం కనీసం వారానికి ఒకసారి కూడా ప్రజావాణికి హాజరుకాలేదని విమర్శించారు. 60 రోజుల్లో ప్రజావాణిలో ఎన్ని సమస్యలు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 60 రోజుల్లో కొన్ని నిమిషాలపాటు సీఎం, మంత్రులు వినతులు స్వీకరిస్తే ప్రజాపాలన ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. గత పదేండ్ల్లలో ప్రగతిభవన్ ప్రజాభవన్గా విరాజిల్లిన విషయాన్ని విస్మరించరాదని చెప్పారు.
రైతు రుణమాఫీ తరహాలో ఆటో రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టాలని, ఆటోడ్రైవర్లకు నెలకు రూ.10 వేలు ఇవ్వాలని పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి, బస్సుల సంఖ్య, ట్రిప్పుల సంఖ్య పెంచలేదని చెప్పారు. కాంగ్రెస్ తీరుతో ఆరున్నర లక్షల మందికిపైగా ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తంచేశారు. రెండు నెలల్లో 21 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలుచేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం రాష్ర్టానికి రూపాయి ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఒక్కరూ నోరు మెదపడంలేదని, బీజేపీతో కుమ్మక్కయ్యారా? అని పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో అన్యాయాలపై కర్ణాటక, కేరళ సీఎంలు ధర్నాలు చేస్తున్నారని, న్యాయబద్ధంగా వాటా సాధించేందుకు రాష్ట్రం తరఫున ఎందుకు పోరాడటం లేదని నిలదీశారు. కేంద్రంతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటే తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. కేంద్రంతో కొట్లాడేందుకు తాము కూడా ప్రభుత్వంతో కలిసి వస్తామని, నిలదీద్దామని సూచించారు. ప్రతి నెలా రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రియాంకగాంధీ డిక్లరేషన్కే దిక్కులేదని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులను, ఈ రాష్ట్రంతో సంబంధంలేని వాళ్లను టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించారని ఆరోపించారు. ఔట్సోర్సింగ్, అడ్హక్, టెంపరరీ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సహా ఒకటో తేదీనే జీతాలివ్వాలని కోరారు. తాము టీఎస్పీఎస్సీ సహా 10 సంస్థల ద్వారా 1.6 లక్షల ఉద్యోగాలను భర్తీచేశామని చెప్పారు.
డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతున్నం త సేపు మంత్రులు, అధికారపక్షం సభ్యులు పదేపదే అడ్డుపడ్డారు. తొలుత మంత్రి శ్రీధర్బాబు పల్లా వ్యాఖ్యలపై స్పందించారు. పల్లా తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా సీఎం రేవంత్రెడ్డి రాగానే సీన్ మారింది. సీఎం సభలో ఉన్నంతసేపు అధికారపక్షం పల్లాపై ఎదురుదాడికి దిగింది. మంత్రులు కొండా సురేఖ, పొ న్నం ప్రభాకర్, సీతక్క అడ్డుతగలారు. ఆ త ర్వాత ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ సైతం కల్పించుకుని మాట్లాడారు. సీ ఎంను ప్రసన్నం చేసుకునేందుకు మంత్రులు, విప్లు తాపత్రయపడుతున్నట్టుగా కనబడుతున్నదని అధికారపక్షం దాడిని పల్లా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. బెదిరిస్తున్నారా? అంటూ అధికారపక్షాన్ని నిలదీశారు.
ఆటో డ్రైవర్ల పరిస్థితిపై పల్లా మాట్లాడుతుండగా, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. యాదగిరిగుట్ట అభివృద్ధి పేరుతో వైటీడీఏను అడ్డాగా మార్చుకుని కల్వకుంట్ల కవిత, జగదీశ్రెడ్డి దోచుకున్నారని ఆరోపించారు. ఈ వాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో జగదీశ్రెడ్డి ఆయనను శాంతింపజేసి వెనక్కి తీసుకొచ్చారు. బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. సభలోని లేని వారి గురించి ఆరోపణలు చేయడం తగదని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు.
అభివృద్ధి విషయంలో భేషజాల్లేవని, ఆర్థికప్రగతి విషయంలో రాజీపడబోమని మంత్రి శ్రీధర్బాబు స్పష్టంచేశారు. ‘అదానీ క్రోనీ క్యా పిటలిస్టు. మోదీ అంతా అదానీకి దోచిపెడుతున్నారని రాహుల్ విమర్శిస్తే.. అదే కాంగ్రెస్ ప్ర భుత్వం రాష్ట్రంలో 12 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నదని, ఇదేం విధానమని రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. దీనిపై మంత్రి శ్రీధర్బాబు రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యమయ్యేందుకు వచ్చే వారిని, పెట్టుబడులను స్వాగతిస్తామని స్పష్టంచేశారు. దేశ సంపద కొందరి చేతుల్లోకి వెళ్లొద్దన్నదే తమ విధానమని, చిన్న తర హా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొస్తామని, తమది సంక్షేమ, అభివృద్ధి పాలన అని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీతోపాటు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీని సముచితంగా గౌరవించిందని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. కవులను, కళాకారులను గుర్తించలేదనడం సరికాదని పేర్కొన్నారు. గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించామని, ఉద్యాన వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వ్యవసాయవర్సిటీకి జయశంకర్ పేరు, వెటర్నరీవర్సిటీకి పీవీ పేరు పెట్టినట్టు గుర్తుచేశారు. గద్దర్ ఆనారోగ్యంగా ఉంటే ఆయనకు దవాఖానలో ఏర్పాట్లు తానే చేశానని, ఆయన మరణించిన తర్వాత పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంకు తీసుకొచ్చి, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. నాటి సీఎం కేసీఆర్.. గద్దర్ ఇంటికి వచ్చి నివాళులు అర్పించారని గుర్తు చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి.. ప్రస్తుత చిహ్నంలోని చార్మినార్ను ఎందుకు తొలగించాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎందుకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇటీవల జిల్లా మంత్రులకు రూ.10 కోట్లు విడుదల చేశారని, తమ ఎమ్మెల్యేలకు కూడా అభివృద్ధి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పల్లా రాజేశ్వర్రెడ్డి తన ప్రసంగాన్ని కవితతో ముగించారు. ఒక కవి రాసిన కవితను సభలో చదివి వినిపించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులంతా బల్లలు చరిచి పల్లాను అభినందించారు.