హైదరాబాద్, మార్చి18 (నమస్తే తెలంగాణ) : గవర్నర్ ప్రసంగంలో ఆరు గ్యారెంటీల ఊసే లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. ఇదీ కాంగ్రెస్ తీరుకు నిదర్శనమని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా పల్లా మాట్లాడారు. ప్రజావాణిని సీఎం క్యాంప్ ఆఫీస్లో పెడుతామని చెప్పిన ప్రభుత్వం అక్కడ పెట్టడం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు ప్రజావాణికి ముఖ్యమంత్రి హాజరుకావడం లేదని, అందులో ఆంతర్యమేమిటో చెప్పలేదని దుయ్యబట్టారు. ప్రజావాణిలో వచ్చిన లక్షలాది అప్లికేషన్లకు ఇప్పటికీ దిక్కులేదని, ఇప్పుడు 99 రోజుల ప్రజాపాలనలో కూడా ఒక్క రూపాయైనా కేటాయించలేదని, అది 9 రోజులకే అటకెక్కిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వార్డులో మీటింగ్ జరిగితే కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేవని, మరెలా సక్సెస్ అవుతుందని ప్రశ్నించారు. వరంగల్ డిక్లరేషన్లో అభయహస్తం పేరిట ఇచ్చిన దొడ్డు ధాన్యానికి బోనస్, మహాలక్ష్మీ, రైతుభరోసా, కౌలురైతులకు ఆర్థికసాయం, పంటబీమా ఇప్పటికీ అమలు కావడం లేదని విమర్శించారు.
కూలీలకు కూడా రైతుబీమా ఇస్తామని చెప్పారని ఆచరణలో లేదని నిప్పులు చెరిగారు. ధరణి పోర్టల్ పేరు మాత్రమే భూభారతిగా మారిందని మరేమీ మారలేదని ధ్వజమెత్తారు. భూభారతిలో పెద్ద స్కామ్ జరిగిందని, జనగామ ఘటనను ఉదహరించారు. దీనిపై దర్యాప్తునకు సిట్ను వేయాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని వివరించారు. మూడుసార్లు రైతుబంధు ఎగబెట్టారని విమర్శించారు. కొత్తగా మంజూరు చేసినా 3.76 లక్షల కొత్త పట్టాపాస్బుక్కుల రైతులకు సైతం రైతుబంధు ఇవ్వాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వరా? అని నిలదీశారు. దేవాదుల ప్రాజెక్టుకు నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరి సమస్యలను ఫోరమ్లలో పెట్టి చర్చిస్తామనడం అవివేకమని ధ్వజమెత్తారు. గద్దర్ అవార్డుల్లోనూ వివక్ష చూపారని, అవి ఖద్దర్ అవార్డుల్లా మారాయని విమర్శించారు.