హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్చేశారు. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లలో 3,23,396 మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తే కేసీఆర్ ప్రభుత్వం కేవలం పదేండ్లలోనే 10 లక్షల మందికి ఉపాధి కల్పించిందని చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, పార్టీ నేత గుత్తా అమిత్రెడ్డి తదితరులతో కలిసి కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ అసత్యాల పునాదిపై నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించిందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని సీఎం రేవంత్రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం నిరుద్యోగ యువతకు తప్పుడు సంకేతాలిచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేసింది నిజమా? కాదా? చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగాల భర్తీ చేసిందని, శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను వెల్లడించారు. 1,60,083 ఉద్యోగాల భర్తీతోపాటు 42,652 ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి ఫలితాల దశలో ఉన్నాయని స్పష్టంచేశారు. కేసీఆర్ సర్కార్ అసలు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రచారం చేసిన కాంగ్రెస్.. ఈ నెల 4న తేదీన చెల్లించిన ఉద్యోగుల వేతనాల్లో కేసీఆర్ హయాంలో భర్తీ అయిన ఉద్యోగులు జీతాలు తీసుకున్నారో? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్ తన మీద వేసిన పరువు నష్టం దావాను కోర్టులో తేల్చుకుంటానని కౌశిక్రెడ్డి చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవిని సీఎం రేవంత్రెడ్డి రూ.50 కోట్లు పెట్టి తెచ్చుకున్నారని అప్పటి కాంగ్రెస్ నేతలు, ప్రస్తుత మంత్రుల్లో ఒకరైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యల్నే తాము ఉదహరించానని, అందులో తానేమీ కొత్తగా చెప్పలేదని అన్నారు.