Niranjan Reddy | బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో రైతులు హతాశులవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్తోనే ఉన్నారని అన్నారు. రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెబితే నమ్మి మోసపోయామని బాధపడుతున్నారని అన్నారు. 1.50 లక్షల ఎకరాల భూమికి రైతుబంధు రావాల్సి ఉందని తెలిపారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల ముగింపు సందర్భంగా నిరంజన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతుబంధుపై రేవంత్రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తాము సకాలంలో రైతుబంధు అందించామని గుర్తుచేశారు. తాము 72,015 కోట్ల రైతుబంధు సాయం అందించినట్లు తెలిపారు. కానీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు రైతుబంధును అడ్డుకున్నారని అన్నారు. అప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతుబంధు సాయం వేయకుండా చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.
ఎన్నికలు అయిపోగానే రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ నేతలు గుండీలు చింపుకున్నారని.. కొత్త ప్రభుత్వం ఏర్పడి 27 రోజులైనా ఎందుకు రైతుబంధు డబ్బులు వేయట్లేదని ప్రశ్నించారు. వరి పండిస్తున్న ఒక్క రైతుకైనా రూ.500 బోనస్ ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అని.. ఒక్కరికైనా చేశారా? అని నిలదీశారు. 70 లక్షల కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. తాము ఉన్నప్పుడు రైతుబంధుపై ప్రతిరోజు మీడియాకు అప్డేట్స్ ఇచ్చామని.. ఇప్పుడు వ్యవసాయ శాఖ ఎందుకు అప్డేట్ ఇవ్వడం లేదని నిలదీశారు. వ్యవసాయ శాఖ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని.. మరి ఎందుకు రైతుబంధు ఇస్తలేరని ప్రశ్నించారు. రైతుకు అవసరం ఉన్నప్పుడు రైతుబంధు ఇవ్వకపోతే ఏం లాభమని అన్నారు. రైతులను అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నెల రోజుల్లో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తే సన్నబియ్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. సన్నబియ్యం ఇవ్వకపోగా.. ఉన్న బియ్యం ధరలను పెంచేశారని మండిపడ్డారు. కిలోకు రూ.25 దాకా ఎలా పెరుగుతుందని.. బ్లాక్ మార్కెట్ చేస్తుంటే కట్టడి చేయరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎల్లిపాయల ధర వెండితో పోటీపడుతోందని.. అల్లం రేటు రూ.220కి చేరిందని గుర్తు చేశారు. ఇలా ధరలు పెరిగితే ఏం నియంత్రిస్తున్నట్లు అని ప్రశ్నించారు. ముందు పాలన మీద దృష్టి పెట్టాలని, ప్రజలకు స్వాంతన ఇచ్చే పనులపై దృష్టిపెట్టాలని సూచించారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేయడంపై కాదు.. ప్రజలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.