KTR | హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధుల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పటికీ, పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నాయకులే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలో సాగు, తాగునీటికి దిక్కు లేదు. కరెంట్ అనేది అడ్రస్సే లేదు. నల్లగొండలో ఫ్లోరోసిస్తో లక్షన్నర మంది నడుములు వంగిపోతుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాతబస్తీలో మైనార్టీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్నగర్లో గంజి కేంద్రాలు, పాలమూరు నుంచే ప్రతి సంవత్సరం 14 లక్షల మంది వలసలు పోయే వారని కేటీఆర్ గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి రోజు రెండు బస్సులు ముంబైకి పోయేవి. నారాయణపేట, మక్తలో కూడా ఇదే పరిస్థితి. వలసలు చూసి కన్నీళ్లు కార్చేవారు. మహబూబ్నగర్లో 50 ఎకరాలు ఉన్న రైతు గుంపు మేస్త్రీగా పని చేసుకునే దుస్థితి. కూలీ చేసుకునే దుస్థితి అని కేటీఆర్ గుర్తు చేశారు.
పదేండ్లు విధ్వంసం జరిగిందన్నారు. మరి 50 ఏండ్ల విధ్వంసం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. జీవన విధ్వంసం చెప్పాలి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించారు. గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ ఏపీ చరిత్ర మాట్లాడొద్దు అంటారు. వాస్తవాలు చెప్పాలి కదా..? సాగునీరు, తాగునీరు, కరెంట్ ఇవ్వలేని అసమర్థత గురించి చెప్తే ఉలికిపాటు ఎందుకు..? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.