BRS | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివినట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ చేసిన ప్రసంగంలో కొత్తదనమేదీ లేదని పేర్కొన్నారు. గత పదేండ్లుగా తెలంగాణ తిరోగమనంలో ఉన్నదని పేర్కొన్న గవర్నర్.. గతంలో ఏమి మాట్లాడారో, ఇప్పుడేమి మాట్లాడారో సమీక్షించుకోవాలని సూచించారు. గత పదేండ్లలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని, వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలు ప్రశంసించిన విషయాన్ని గవర్నర్ మరచిపోయారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఎటువంటి ప్రణాళిక గవర్నర్ ప్రసంగంలో లేదని దుయ్యబట్టారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి రాబోయే ఐదేండ్ల రోడ్మ్యాప్ను ప్రకటించలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. నూతన ప్రభుత్వం ఏ మార్గం ఎంచుకుంటుంది? ఏ రకమైన ప్రణాళికలు రూపొందించించనున్నదో వెల్లడించలేదని విమర్శించారు.
2014లోనే తెలంగాణకు విముక్తి
ప్రజలందరూ ఇప్పుడే సంతోషపడుతున్నట్టు, స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నట్టు గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం సరైంది కాదని కడియం శ్రీహరి స్పష్టంచేశారు. గత పదేండ్లుగా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చారని వివరించారు. ఇప్పుడే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందంటూ గవర్నర్ చెప్పడం సరికాదని, అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఇది గవర్నర్ పదవికి శోభనివ్వదని చెప్పారు. ‘తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. 2014లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయింది. ఇప్పుడు కావడమేమిటి?’ అని ప్రశ్నించారు.
బోనస్ ధర ప్రస్తావన ఏదీ?
గవర్నర్ చేత రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని, గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు గవర్నర్ ప్రసంగాన్ని వాడుకున్నదని కడియం శ్రీహరి దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంలో దళితబంధు, మద్దతు ధరకు రూ.500 బోనస్ ప్రస్తావన లేదని విమర్శించారు. దీనిని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కనబడటం లేదని పేర్కొన్నారు. గతంలో 24 గంటల కరెంట్ ఇవ్వలేదన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ .. తమ హయాంలో 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని రైతులు, ప్రజలు రోడ్డెక్కిన పరిస్థితులు ఎక్కడా లేవని గుర్తుచేశారు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలపై సరైన సమాధానం చెప్తామని స్పష్టంచేశారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, కాలె యాదయ్య, కాలేరు వెంకటేశ్, అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీలు శంభీర్పూర్ రాజు, ఎంసీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.