MLA Jeevan Reddy | ఖలీల్వాడీ : కేంద్ర ప్రభుత్వం పేరుతో బీజేపీ గోల్కొండ కోటపై గోల్మాల్ తతంగం నడిపిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో బీజేపీ క్షుద్ర రాజకీయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పకుండా సొల్లు పురాణం చెప్పారని విమర్శించారు. నిజామాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి జీవన్రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
దశాబ్ది ఉత్సవాల పేరుతో కేంద్ర టూరిజం మంత్రి కిషన్రెడ్డి క్షుద్ర రాజకీయం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం, పదేళ్లలో జరిగిన అభివృద్ధిపై చెప్పకుండా కేసీఆర్పై, ఆయన కుటుంబంపై విషం కక్కడానికే మొత్తం సమయాన్ని కేటాయించారని ధ్వజమెత్తారు. పదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో, ఇక ముందు ఏమిస్తుందో చెప్పకుండా కిషన్రెడ్డి పచ్చి అబద్ధాలు వల్లెవేస్తూ సొల్లు పురాణం వినిపించారని విమర్శించారు.
‘అధికార వేదికపై ఎలా మాట్లాడాలో తెలియని అజ్ఞాని కిషన్రెడ్డి. ఆయన గోల్కొండ కోటపై దర్శనమిచ్చిన గోబెల్స్ అవతారం. అప్పుడప్పుడు తెలంగాణలో కనబడే టూరిస్ట్. అందుకే రాష్ట్రంలో ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయో, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులున్నాయో, ఎంత పంట పండుతుందో, ఎన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో తెలియదు. బీజేపీ నాయకులది చదువురాని సన్నాసుల సంఘం. ఈ సంఘానికి అధ్యక్షుడు మోదీ అయితే, ఉపాధ్యక్షుడు కిషన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తొండి మాటల బండి సంజయ్, జిల్లా అష్ట దరిద్రపు ఎంపీ అరగుండు అరవింద్ కార్యదర్శి. ఈ చదువురాని మొద్దులకు తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదు. రాష్ట్రం రాక ముందు తెలంగాణ ఎట్లుంది, రాష్ట్రం వచ్చినంక పదేండ్లలో ఎట్లుంది అని నాడు – నేడు పేరుతో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ దేశమే గర్వపడుతున్న తెలంగాణ మోడల్పై రోజుకోక సబ్జెక్ట్పై వివరించే కార్యక్రమాన్ని మేం నిర్దేశించుకున్నాం. దీన్ని ఓర్వలేక బీజేపీ కొత్తగా కేంద్రం ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల పేరుతో సరికొత్త డ్రామాలకు తెర లేపింది అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
కిషన్రెడ్డి చిత్రీకరించినట్లు తెలంగాణ అప్పుల కుప్ప కాదు, అభివృద్ధి, సంక్షేమ రాష్ట్రం, వాస్తవానికి బీజేపీయే దేశాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది అని జీవన్ రెడ్డి తెలిపారు. 14 మంది ప్రధానమంత్రులు రూ.56 లక్షల కోట్ల అప్పులు తెస్తే, ఒక్క మోడీ ప్రభుత్వమే రూ.80ల క్షల కోట్ల అప్పులు చేసింది. ప్రతి క్షనానికి రూ.5.34 లక్షల కోట్ల అప్పులు చేస్తున్నది. తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని పదేపదే గొంతు చించుకుంటున్న కిషన్రెడ్డికి ఇది కనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు. 2021-22 లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆ ఏడాది చేసిన అప్పు రూ.14,86,618 కోట్లు. ఇక రోజువారిగా గణిస్తే నిత్యం రూ.4,073 కోట్లు అప్పు చేసింది. తెలంగాణ దగా పడ్డ తెలంగాణగా మారిపోయిందన్న కిషన్రెడ్డి.. అన్ని రంగాల్లో తెలంగాణ టాప్ అని కేంద్రం అవార్డుల మీద అవార్డులు ఎందుకిస్తుందో తెలుసుకోవాలి. ధరణి, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలపై కిషన్రెడ్డి కళ్లల్లో నిప్పులు పోసుకున్నాడని జీవన్రెడ్డి దుయ్యబట్టారు.