Harish Rao | హైదరాబాద్ : ప్రభుత్వ శాఖలన్నింటిపైనా శ్వేత పత్రాలను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బుధవారం జరగబోయే శాసనసభ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు లేఖ రాశారు. రేపు సభలో తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని సభాపతిని హరీశ్రావు కోరారు.
రేపటి నుంచి జరిగే శాసనసభ సమావేశాలలో ఆర్థిక, సాగునీటి మరియు విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం ఉంది. ఒక వేళ ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అనుమతించినట్లైతే, దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు సభ ద్వారా మా వర్షన్ తప్పక చెప్పవలసి ఉంటుంది. మేము కూడ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం అని హరీశ్రావు తన లేఖలో పేర్కొన్నారు.