Harish Rao | రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్ నాయకులు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందని హరీశ్రావు అన్నారు. సువిశాలమైన ప్రగతి దారులను నిర్మించిందన్నారు. కొత్త ప్రభుత్వం ఆ దారుల వెంట ముందడుగు వేస్తూ ప్రజలే కేంద్రంగా పనిచేయాలన్నారు. రాజకీయ కక్షల చుట్టూ పరిభ్రమించే వైఖరికి భిన్నంగా.. అభివృద్ధి కక్షలో పరిభ్రమిస్తే వారికి మంచిది.. ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిదని సూచించారు. కానీ ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు.. శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు, ప్రగతి అనే కోణం కన్నా.. రాజకీయ ప్రత్యర్థులపై దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనిపిస్తుందన్నారు.
ఆర్థిక శ్వేతపత్రం పేజి 5లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ అంచనా- వ్యయాలకు సంబంధించి కాగ్ రిపోర్టు చూశామని హరీశ్రావు తెలిపారు. అందులో బడ్జెట్ అంచనా 2,31,142 కోట్లు ఉంటే.. 2,31,642 కోట్లుగా చూపించారన్నారు. వ్యయాల్లో కూడా 2,61,932 కోట్లు అని చూపించారని.. కాగ్ రిపోర్టు ఆధారంగా 2,54,525 కోట్లు ఉందన్నారు. అంటే.. దాదాపు 7 వేల కోట్ల ఎక్సపండిచర్ ఎక్కువగా చూపించారని తెలిపారు. మొత్తంగా తప్పుల తడకగా వివరాలు పొందుపరిచారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ధోరణి ఇందులో కనిపిస్తుందన్నారు.