BRS MLA Harish Rao | ప్రజలను మభ్యపెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఆగస్టు 15 లోపు రుణ మాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్ రావు పేర్కొన్నారు. ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీపై హరీశ్ రావు `ఎక్స్ (మాజీ ట్విట్టర్)` ఖాతాలో స్పందించారు. డిసెంబర్ తొమ్మిదో తేదీ నాడే రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రుణ మాఫీ అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటానికి భయపడే సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నారని, ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు.
డిసెంబర్ 9న ఆడే రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలి.రుణమాఫీ కోసం టిఆర్ఎస్ పార్టీ చేసిన…
— Harish Rao Thanneeru (@BRSHarish) April 15, 2024
మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమయిందని హరీశ్ రావు ప్రశ్నించారు. వృద్ధులకు వృద్దాప్య పెన్షన్ రూ.4000లకు పెంచుతామన్న హామీ మేరకు పెన్షన్లు ఎప్పుడు పెంచి ఇస్తారని నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చిత్తశుద్ది లేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓడిపోతామన్న భయంతోనే కొత్త హామీలు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు నమ్మకం కోల్పోయారన్నారు.