Harish Rao | హైదరాబాద్ : పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బిఆర్ఎస్ లక్షా 62 వేల ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ 5 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకు వాడుకోవడం ఆయన దుస్థితికి నిదర్శనం. ఉద్యోగ నియామక పత్రాలిచ్చే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన ఉన్మాద ప్రవృత్తిని మరోసారి బయట పెట్టుకున్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఇంకెంత కాలం డప్పు కొట్టుకుంటావు రేవంత్ రెడ్డి? ఏడాదిన్నరగా నువ్వు ఇస్తున్న నియామక పత్రాలు అన్ని కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లె కదా. ఈరోజు కూడా కేసీఆర్ ప్రభుత్వ హయంలో ఇచ్చిన పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్లకు, పెట్టిన పరీక్షలకు నియాక పత్రాలు ఇచ్చినవు. కేసీఆర్ హయంలో మొదలై చివరి దశకు వచ్చిన ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేసి జబ్బలు చరచుకుంటే బొప్పి కట్టడం తప్ప ఒరిగేదేమి ఉండదు అని హరీశ్రావు చెప్పారు.
తొమ్మిదిన్నరేండ్ల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 62 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం. ఏడాదిన్నర కాలంలో నోటిఫికేషన్ల ద్వారా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు ఐదారు వేలు మించ లేదనేది వాస్తవం. 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కేలా కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించారు. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, హామీల అమలులో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ అయ్యింది. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయింది. నిరుద్యోగ భృతి తీవ్ర నిరాశను మిగిల్చింది అని హరీశ్రావు పేర్కొన్నారు.
రేవంత్ లాంటి కుసంస్కారి కేసీఆర్పై చిల్లర విషయాలు చెబితే నమ్మడానికి ఉద్యోగాలు పొందిన వారు అమాయకులు కారు. 55 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పిన అబద్ధాన్నే ప్రతి చోటా చెబుతూ రేవంత్ తుపాకీ రాముడిని మించిపోయారు. పాలన చేతకాక రేవంత్ ‘పరనింద”నే పనిగా పెట్టుకున్నారు. సీఎం గా వచ్చిన అవకాశాన్ని రాష్ట్రం బాగు కోసం వాడక తన పదవి ఉంటుందో ఊడుతుందోనని అభద్రతా భావం తో మాట్లాడుతున్నారు. తన పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతూ బీఆర్ఎస్ పై నెపం నెట్టి సానుభూతి రాజకీయానికి తెర లేపుతున్నారు. హంతకుడు సంతాప సభ పెట్టినట్టు ఉంది రేవంత్ తీరు అని హరీశ్రావు విమర్శించారు.
రాష్ట్రానికి క్యాన్సర్ సోకిందంటూ రేవంత్ రెడ్డి ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. తన చేతకాని తనాన్ని రాష్ట్ర ప్రజలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధమాడకపోతే పూట గడవదు అనే పద్దతి లో రేవంత్ వ్యవహారం ఉంది. గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి గారడీ మాటలు చెబుతున్నాడు. రేవంత్ రెడ్డికి కాన్సిల్ జబ్బు సోకింది. ఎన్నికలపుడు తాను చెప్పినవన్నీ కాన్సిల్ అంటున్నాడు. ప్రతిపక్షనేతలు ప్రజల పక్షాన పోరాడుతుంటే వాళ్ళ మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డిది. పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం మార్చురీ వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నిజాన్ని నమ్ముకోలేదు.. నిందలనే నమ్ముకున్నాడు. కష్టాన్ని నమ్ముకోలేదు.. కుతంత్రాలనే నమ్ముకున్నాడు. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి తాను ఉన్నది సీఎం పదవిలో అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుని చిల్లర వేషాలు మానితే మంచిది అని హరీశ్రావు హెచ్చరించారు.