Harish Rao | హైదరాబాద్ : ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. దీంతో ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నమనే మాటలు కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని తెలిపారు. మోడల్ స్కూల్ టీచర్లకు గత 7 నెలల నుండి ఏ నెలలో కూడా 1వ తేదీన వేతనాలు చెల్లించకపోవడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనం అని మండిపడ్డారు.
ఈనెల 13 రోజులు గడిచినప్పటికీ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ జీతాలు అందక అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 8వ తేదీన సగం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించిన సర్కారు, రంగారెడ్డి, నిజామాబాద్, వనపర్తి, సూర్యపేట, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, పెద్దపల్లి మొత్తం 8 జిల్లాలో పని చేస్తున్న వెయ్యి మందికి పైగా రెగ్యులర్ టీచర్లకు ఇంకా వేతనాలు చెల్లించలేదు. వీరితో పాటు మోడల్ స్కూల్స్లో పని చేసే ఔట్ సోర్సింగ్, హవర్లీ బేస్డ్ టీచర్స్ (HBT) దాదాపు 2వేల మందికి ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేసే గెస్ట్ లెక్చరర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పడం బాధాకరం అని హరీశ్రావు అన్నారు. అధికారంలోకి రాగానే రూ. 42 వేల వేతనం చెల్లిస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ, వారి ఉద్యోగ భవిష్యత్ను దెబ్బతీసేలా కేవలం మార్చి 31 నుంచి జులై 31 వరకే కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గం. ఇందులో ఏప్రిల్, మే నెలల్లో సెలవులే ఉండగా, కేవలం జూన్, జులై నెలకు మాత్రమే పొడిగింపు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ నిర్ణయం వల్ల గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న1654 మంది గెస్ట్ లెక్చరర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది అని హరీశ్రావు తెలిపారు.
విద్యాసంవత్సరం మధ్యలో ఉద్యోగాలు నిలిపివేస్తే, ఎలా బతికేది అని లెక్చరర్లు, వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి విద్యాసంవత్సరానికి పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థను ఎత్తేసేందుకు కుట్ర చేస్తున్నట్లు వారు ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యలు పరిష్కరించాలి. అభయహస్తం మేనిఫెస్టోలో హామి ఇచ్చినట్లుగా గెస్ట్ లెక్చరర్లకు భరోసా ఇవ్వడంతో పాటు, నెలకు రూ. 42 వేల వేతనం చెల్లించి, విద్యాసంవత్సరం చివరి వరకు ఉద్యోగ కాలాన్ని పొడగించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.