హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): లఘు చర్చ సందర్భంగా సభలో సభ్యులకు 42 పేజీల శ్వేతపత్రాన్ని ఇచ్చిన నాలుగు నిమిషాలకే చర్చను ప్రారంభించాలని స్పీకర్ కోరడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తప్పుబట్టారు. ఆ పుస్తకాన్ని చదువుకునేందుకు సమయం ఇవ్వాలని సభ్యులు కోరడంతో టీ విరామం తర్వాత చర్చను కొనసాగించేందుకు స్పీకర్ సభను వాయిదా వేశారు. బుధవారం సభ ప్రారంభమయ్యాక సభ్యులందరికీ శ్వేతపత్రాన్ని అందజేసిన తర్వాత ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. తర్వాత చర్చను ప్రారంభించాలని కోరడంతో హరీశ్రావు పైవిధంగా స్పందించారు.
సభ్యులకు ముందుగా నోట్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తంచేశారు. భవిష్యత్తులోనైనా లఘు చర్చల నోట్లు ముందురోజే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సమాధానం సంతృప్తి ఇవ్వకుంటే నిరసన చేయడం సభ్యుల హక్కని, ఆ అవకాశాన్ని కూడా స్పీకర్ ఇవ్వలేదని విమర్శించారు. ఎంఐఎంఎల్పీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వ ఇచ్చిన గణాంకాల అధ్యయనానికి 40 నిమిషాల నుంచి గంటపాటు టీ విరామం ఇవ్వాలని కోరారు. సీపీఐఎల్పీ నేత కూనంనేని మాట్లాడుతూ.. ఆర్థికశాఖ మంత్రి ప్రసంగానంతరం గురువారం చర్చ జరపాలని కోరారు.
సభ్యుల సూచనలపై మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. గతంలో ఇలాంటి సంప్రదాయాన్ని పాటించలేదని, లఘుచర్చల సమయంలో నోట్ను ముందుగా ఇచ్చిన దాఖలాలు గతంలో లేవని గుర్తు చేశారు. హరీశ్రావు అనుభవజ్ఞులు కనుక ఆయనకు విరామం అవసరం లేదని, అయినప్పటికీ సభ్యుల సూచన మేరకు స్పీకర్ అనుమతిస్తే టీ విరామం తర్వాత చర్చను కొనసాగిస్తామని చెప్పడంతో స్పీకర్ ప్రసాద్కుమార్ సభను వాయిదా వేశారు. అంతకుముందు భట్టి మాట్లాడుతూ.. పవిత్రమైన అసెంబ్లీ ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రాన్ని విడుదల చేసినట్టు చెప్పారు. దీనిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులను కోరారు.