హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంక్షేమానికి దేశమంతా జేజేలు పలుకుతున్నదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు చెప్పారు. కేసీఆర్ పాలనను దేశంలోని అన్ని రాష్ర్టాలు హర్షిస్తున్నాయని అన్నారు. కానీ, విపక్షాలకు మాత్రం తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమం కనిపించకపోవడం దౌర్భాగ్యమని విమర్శించారు. బుధవారం బడ్జెట్పై శాసనసభలో జరిగిన చర్చలో బాలరాజు మాట్లాడారు. దే. దళితజాతి బాగును జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీ దళితబంధును అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
కులవివక్షతో దళితులను హత్యచేసే బీజేపీకి దళితబంధు గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని లేకుండా చేసి, మోదీ, అమిత్షా రాజ్యాంగాన్ని తీసుకొచ్చే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ప్రగతిభవన్ను బాంబులతో కూల్చేయాలని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతమని తెలిపారు. బాంబులతో పేల్చడమే కాంగ్రెస్ ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు ఎర కేసులో బీజేపీ బండారం భయటపెట్టానని, బీజేపీ గూండాలు, చెంచాగాళ్లు అర్ధరాత్రి తనకు కాల్చేసి బెదిరిస్తున్నారని చెప్పారు.
కొత్త మండలాల్లో టీచర్లకు సమస్యలు లేకుండా చూడాలి : చైర్మన్ గుత్తా
జీవో 317 ద్వారా కొత్త మండలాల్లో నియామకమైన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇటీవల పదోన్నతులు, బదిలీలతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నందున.. ఆయా పాఠశాలల్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయుల సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.
నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలి: జాఫ్రీ
బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధుల కేటాయింపు లేదని ఎంఐఎం సభ్యులు జాఫ్రీ అన్నారు. ఆరేండ్ల్లుగా ముస్లిం రిజర్వేషన్ల బిల్లు పెండింగ్లో ఉందన్నారు. మైనార్టీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని సూచించారు.
ప్రాజెక్టులకు భారీగా నిధులు : మంకెన కోటిరెడ్డి
తెలంగాణ చిన్న రాష్ట్రమైనా రూ.2.9 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టడం గొప్ప విషయమని, ఇందుకు సీఎం కేసీఆర్ మేధాశక్తి, దూరదృష్టి కారణమని మంకెన కోటిరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిండి ప్రాజెక్టుకు రూ.250 కోట్లు, సాగర్ ఎడమ కాల్వకు రూ.250 కోట్లు, సాగర్ ఎత్తిపోతలకు రూ.141 కోట్లు, మూసీ ప్రాజెక్టుకు రూ.30 కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
బడ్జెట్లో గుణాత్మక మార్పు: భానుప్రసాద్రావు
తెలంగాణ ఏర్పడిన తర్వాత బడ్జెట్ రూపకల్పనలో గుణాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు అన్నారు. మండలిలో 13వ సారి బడ్జెట్పై మాట్లాడే అవకాశం రావడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది పేదల బడ్జెట్ అన్నారు. గ్రామాల్లో సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు జరిగాయని చెప్పారు.
రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేయాలి: జీవన్రెడ్డి
రైతుబంధు మంచి పథకమని, గతంలో వ్యవసాయానికి ఉన్న సబ్సిడీ పథకాలను కొనసాగించాలని కాంగ్రెస్ సభ్యుడు టీ జీవన్రెడ్డి సూచించారు. రైతు రుణమాఫీకి రూ.20 వేల కోట్లు కేటాయించాలని కోరారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలన్నారు. కోతుల నివారణకు స్టెబిలైజేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, ధరణి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ బోర్డు ఏర్పాటుచేయాలని సూచించారు.
కేంద్రం కక్ష: బండా ప్రకాశ్
కేంద్రం తెలంగాణ పట్ల అన్ని రంగాల్లో కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని బండా ప్రకాశ్ విమర్శించారు. ఉపాధిహామీ నిధుల్లో కోతపెట్టి, పనిదినాలు తగ్గించిందని, కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ నిధులను తగ్గించారని పేర్కొన్నారు. తెలంగాణ సంక్షేమ రాష్ట్రమని చెప్పారు. తెలంగాణలో గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు పెరిగేందుకు వ్యక్తులు కేంద్రంగా సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు.
కొత్త పుంతలు తొక్కుతున్న ప్రగతి : కాటేపల్లి జనార్దన్రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయింపులు పెరిగాయని తెలిపారు. రూ.398 వేతనంపై పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు కల్పించాలని సూచించారు.
దళితుల అభ్యున్నతికి తోడ్పడే బడ్జెట్ : ఎంఎస్ ప్రభాకర్
రాష్ట్ర బడ్జెట్ దళిత వర్గాల అభ్యున్నతికి తోడ్పడుతుందని ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ అన్నారు. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. . బడ్జెట్లో ఉస్మానియా దవాఖానకు నిధులు కేటాయించాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జీహెచ్ఎంసీకి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కేసీఆర్ కిట్ ఇవ్వాలి : రఘోత్తమరెడ్డి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్బ్యాగ్, బుక్స్, యూనిఫాం, టై, బెల్ట్, కంపాక్స్ బాక్స్ వంటి వాటితో కేసీఆర్ కిట్ను రూపొందించి అందజేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి సూచించారు. . కేజీబీవీ, మాడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు కల్పించాలని కోరారు.