కామారెడ్డి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వీకుల గ్రామం కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నదని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ను ఆహ్వానించినట్టు ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టం చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గంప మాట్లాడుతూ కేసీఆర్ పూర్వీకులు బీబీపేట మండలం కోనాపూర్లో నివసించేవారని, మానేరు డ్యామ్లో పంట పొలాలు మునిగిపోవడంతో ఇక్కడి నుంచి సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లినట్టు తెలిపారు.
అందుకే కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తానే స్వయంగా మూడు సార్లు విన్నవించినట్టు చెప్పారు. కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే సామాన్య కార్యకర్తగా పని చేస్తానని స్పష్టంచేశారు. తాను ఓడిపోతాననే భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ను కామారెడ్డికి తీసుకొస్తున్నట్టు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించారు. ఇప్పటికే మాజీ మంత్రి షబ్బీర్ అలీపై నాలుగుసార్లు గెలుపొందిన విషయాన్ని గుర్తుచేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి చెందని గ్రామం ఏదైనా ఉన్నదని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని, దమ్ముంటే చర్చకు రావాలని షబ్బీర్అలీకి సవాల్ విసిరారు.