CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు( వ్యవసాయ రంగ వ్యవహారాలు)గా తనను నియమించినందుకు వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా రమేశ్ బాబు మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల నుంచి వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, కేవలం దశాబ్ది కాలంలోపే అధిగమించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం నేడు వ్యవసాయ విధానాల అమలులో, వ్యవసాయాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమేశ్ బాబు పేర్కొన్నారు. కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రెండవ దశలో భవిష్యత్తు సవాళ్లకు సిద్దమౌతున్న సమయంలో సీఎం తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఎమ్మెల్యే రమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెన్నమనేనికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.