Congress | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): మొన్న ఖర్గే సభ వెలవెల.. నిన్న రేవంత్ సభ ఖాళీ.. నేడు ప్రియాంక సభ కళావిహీనం.. పైన పటారం లోన లొటారం. నియోజకవర్గాల్ని దాటి బయటకు రాలేని స్థితిలో పార్టీ ముఖ్యనేతలు.. కనిపించని ప్లానింగ్.. విఫలమవుతున్న టైమింగ్.. ఇదీ కాంగ్రెస్ ప్రచార సరళి. మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుండగా.. కాంగ్రెస్ ఇప్పటికీ ప్రజలను చేరలేకపోయింది. ఇరుకు ప్రదేశాల్లో ఐదారువేల కుర్చీలు వేసి, ఇతర ప్రాంతాల జనాన్ని తరలించి, కిక్కిరిసినట్టు చూపిద్దామనుకొన్న ఆ పార్టీ ప్లాన్ కూడా ఫెయిలైంది.
ప్రధాన వక్తలు ప్రసంగించే సమయంలోనూ ఆమాత్రం కుర్చీలు కూడా నిండకుండా, వచ్చిన కొద్దిమంది జనం కూడా మధ్యలోనే వెళ్లిపోతుండటం కాంగ్రెస్ పార్టీ రేపటి ఓటమికి నేటి శకునంలా కనిపిస్తున్నది. సోషల్మీడియాలో కనిపిస్తున్నట్టుగా క్షేత్రస్థాయిలో గాలి లేదు.. ధూళి లేదు.. అంతా తుస్సేనని తేలిపోయింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాల్గొంటున్న ఎన్నికల ప్రచార సభలు జనంలేక వెలవెలబోతున్నాయి.
ఎన్నికల్లో గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం పరువు నిలుపుకొనే పరిస్థితి కూడా లేకుండా పోయిందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులుగా చెప్పుకొనే నేతలు తమతమ నియోజకవర్గాల్లో జనం నుంచి స్పందన రాక చేతులెత్తేస్తున్నారు. సోషల్ మీడియాలో వీస్తున్నది ఉత్త గాలిబుడగేనని తేలిపోతున్నది. సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డే కొడంగల్లో కొట్టుమిట్టాడుతున్నారనే ప్రచారం సాగుతున్నది. జగిత్యాలలో జీవన్రెడ్డి ఎదురీదుతున్నారు.
పదవులే తనను వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకున్న జానారెడ్డి కుమారుడు నాగార్జునసాగర్లో విలవిల్లాడుతున్నారు. మధిరలో భట్టివిక్రమార్కను ఓడించాలని సాక్షాత్తు కాంగ్రెస్ శ్రేణులే కంకణం కట్టుకున్నాయి. డబ్బుతో ఏదైనా సాధించగలం అని భావించే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండలో నకనకలాడుతున్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి ఘోర పరాజయాన్ని చవిచూసి పార్టీ మారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి జనం చుక్కలు చూపిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదనే అభిప్రాయంతో ములుగు బరిలో నిలిచిన సీతక్కకు ములుగులో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. క్రితం ఎన్నికల నుంచి సీఎం కుర్చీపై కన్నేసిన మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి హుజూర్నగర్లో, ఆయన సతీమణి కోదాడలో ఎదురీదుతున్న వాతావరణం కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేస్తున్నది.
అగ్రనేతల సభలు వెలవెల
కాంగ్రెస్ సభలకు జనం ముఖం చాటేస్తుండటంతో అభ్యర్థులు కకావికలమవుతున్నారు. వానను సైతం లెక్కచేయకుండా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు వస్తున్న ప్రజలను చూసి కాంగ్రెస్ శిబిరాలు డీలాపడుతున్నాయి. మల్లికార్జున్ ఖర్గే గద్వాల, నల్లగొండ, మునుగోడుల్లో నిర్వహించిన సభల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు జనం లేక వెలవెలబోతున్నాయి. ఒక్కో సభకు రెండు మూడు రోజుల ముందు నుంచే జన సమీకరణ చేస్తున్నా పెద్దగా స్పందన రావడం లేదు. శుక్రవారం పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిర్వహించిన సభలకు జనం కరువయ్యారు.
హుస్నాబాద్లో ప్రియాంక నిర్వహించిన సభకు 30 వేల మంది అంచనా వేస్తే కనీసం 5 వేలు కూడా దాటకపోయేసరికి కాంగ్రెస్నేతలు తలపట్టుకొన్నారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిర్వహించిన నకిరేకల్, సూర్యాపేట, తుంగతుర్తి సభలు మొత్తం ఖాళీగానే కనిపించాయి. ఖర్గే, రాహుల్, ప్రియాంక, రేవంత్రెడ్డి సభల్లో వారు మాట్లాడుతుండగానే వచ్చిన ఆ కొద్ది మంది జనం కూడా వెనుతిరిగిపోవటం కనిపించింది. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిర్వహించిన సభలో జనం వెళ్లిపోతుంటే ఆగండని ఆయన బతిమాలుకోవాల్సి వచ్చింది. అయినా జనం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. గత నాలుగైదు రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.
బీఆర్ఎస్ సభరాంగణం.. కాంగ్రెస్ కకావిలకం
బీఆర్ఎస్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. సభా ప్రాంగణాల్లో ఉన్న జనంతో పోటీపడుతూ బయట అదే స్థాయిలో జనం ఎల్ఈడీ స్క్రీన్లలో సీఎం కేసీఆర్ ప్రసంగాలను శ్రద్ధగా వింటున్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే సభలే అయినా ఉద్యమకాలం నాటి సన్నివేశాలను ఆవిష్కరిస్తున్నాయి. బోనాలు.. బతుకమ్మలతో మహిళలు సభలకు పోటెత్తుతూ ఉద్యమస్ఫూర్తిని చాటుతున్నాయి. అదే కాంగ్రెస్ పార్టీ సభలు పేలవంగా ఉంటున్నాయి.
వచ్చిన జనంలో ఎటువంటి స్పందనా కనిపించటం లేదు. ఇరుకు మైదానంలోనే సభలు పెట్టినా జనం లేక నిండటం లేదు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్పై, తెలంగాణపై చేస్తున్న ఆరోపణలను జనం ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. సోషల్ మీడియాలో పేరుకుపోయిన కట్టుకథలే తప్ప సమాజంలో బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత లేదని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలే తేల్చిచెప్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేసీఆర్ను విమర్శించటం ద్వారానే ప్రయోజనం పొందుతామనుకొంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.